Pawan Kalyan: హైదరాబాద్లో జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈవెంట్లో దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా మార్చి 26, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అనే సెకండ్ సింగిల్ను విడుదల చేశారు. అక్కడ విద్యార్థుల మధ్య హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ గురించి మనసు తెరిచి మాట్లాడారు.
అయన మాట్లాడుతూ, “గబ్బర్ సింగ్ హిట్ తర్వాత చాలా మంది నిర్మాతలు పవన్ కల్యాణ్ గారితో సినిమా చేయాలని వచ్చారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు యాడ్స్ చేయమని అడిగాయి. 2012లో పాన్ ఇండియా అనే పదమే లేదు. షారుక్ ఖాన్ యాడ్స్కు ఎంత తీసుకుంటారో అంత మొత్తాన్ని పవన్ కల్యాణ్ గారికి ఆఫర్ చేశారు. కానీ కొన్ని ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివి కావు, చిన్న పిల్లలకు మంచివి కావు అని ఆయన తిరస్కరించారు. నా కళ్ల ముందే కోట్ల రూపాయలు వదిలేశారు” అని అన్నారు.
అలాగే ఈ సినిమాలోని పాట గురించి మాట్లాడుతూ,
“హీరో ఇంట్రడక్షన్ పాట అంటే ఏ హీరోకైనా సరిపోయే పదాలు ఉంటాయి. కానీ ఈ పాటలోని ప్రతి పదం కేవలం పవన్ కల్యాణ్ గారినే దృష్టిలో పెట్టుకుని చంద్రబోస్ రాశారు. మొత్తం 8 గంటల్లో ఈ పాటను పూర్తి చేశాం” అని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ..”ఈ పాట అభిమానంతో వచ్చినది కాదు. పవన్ కల్యాణ్ గారి జీవన విధానం, సినిమా ప్రయాణం, రాజకీయ ప్రయాణం తెలుసుకుని వచ్చిన పాట. ఈ పాటలో ఏ లైన్ విన్నా కల్యాణ్ గారే గుర్తుకు వస్తారు. ఆయనకు విజయం రాత్రికి రాత్రే రాలేదు. అది ఈ పాటలో స్పష్టంగా వినిపిస్తుంది” అని చెప్పారు.
చివరగా..”అభిమానులు పవన్ కల్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తారు. కానీ డీఎస్పీ పాటాభిషేకం, చంద్రబోస్ సిరాభిషేకం చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే ప్రతిదీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటుంది. మార్చి 26న సినిమా విడుదల అవుతుంది” అని హరీశ్ శంకర్ అన్నారు.