CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి రంగంపై తన దార్శనికతను పంచుకున్నారు. గోదావరి జలాల వినియోగంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని.. అప్పుడే ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు మన వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునే వాళ్లమని గుర్తు చేశారు. గత పదేళ్ల పాలనలో చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే 967 టీఎంసీల గోదావరి జలాలను వాడుకుంటూ కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా నీటిని తరలించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంపై ప్రస్తుతం 8.11 లక్షల కోట్ల రూపాయల భారీ అప్పుల భారం ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కొరత వేధిస్తున్నప్పటికీ కేవలం రెండేళ్ల కాలంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. 2001లో ప్రారంభమైన దేవాదుల ప్రాజెక్టు అంచనాలు 6 వేల కోట్ల నుండి ఏకంగా 18,500 కోట్లకు పెరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తుమ్మిడిహట్టి నుండి భద్రాచలం వరకు గోదావరి నదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. కాళేశ్వరం నుండి ఒక్క చుక్క నీరు ఎత్తిపోయకపోయినా దేశంలోనే వరి దిగుబడిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలవడం గత ప్రభుత్వ భ్రమలను పటాపంచలు చేసిందని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ తెలంగాణ ప్రతినిధిగా ఉండి పొరుగు రాష్ట్రానికి నీళ్లు తరలించడానికి ఎవరైనా సహకరిస్తారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చౌకబారు ఆరోపణలు మాని విలువైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో పక్క రాష్ట్రాలతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని.. సాధ్యం కాకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. గోదావరి జలాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో చర్చిద్దామని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని.. ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా విషం కక్కడం సరికాదని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కీలక భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ఎవరి సొంత ఆస్తి కాదని.. అది ప్రజల సొమ్మని.. దానిని గాలికి వదిలేయబోమని పేర్కొన్నారు. ప్రాజెక్టు లోపాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని.. భవిష్యత్తులో నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని మళ్లీ వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. కేసీఆర్ తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని.. యోగా.. వాకింగ్ చేస్తూ మంచి పుస్తకాలు చదవాలని సూచించారు. 2034 వరకు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రతి పొలానికి సాగునీరు.. ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే తమ అంతిమ లక్ష్యమని చాటిచెప్పారు.