Hero Dharmendra: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీ మ్యాన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. తనకంటూ ఊహించని క్రేజ్ అందుకున్న ధర్మేంద్ర (Dharmendra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నవంబర్ 10వ తేదీన రెగ్యులర్ చెకప్ లో భాగంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చేరగా.. ఆయన వెంటే ఆయన భార్య హేమమాలిని (Hema Malini) , చిన్న కొడుకు బాబీ డియోల్ (Bobby Deol) ఆయన ఆరోగ్య విషయాలను దగ్గరుండి మరీ చూసుకున్నారు. అయితే సడన్గా మరణించారంటూ వార్తలు రాగా కుటుంబ సభ్యులు వెంటనే స్పందిస్తూ మీడియాపై మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఆయన క్షేమంగా డిస్చార్జ్ అయినట్లు స్పష్టం చేశారు.
బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో గత రెండు, మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్న హీరో ధర్మేంద్ర నేడు డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యుడు ధ్రువీకరించారు. ధర్మేంద్రను ఆయన కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో డిస్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఇకపోతే ఈ విషయం వైద్యుడు అధికారికంగా ధ్రువీకరించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ALSO READ:Bollywood: హాస్పిటల్లో చేరిన మరో నటుడు..61 ఏళ్ల వయసులో
ఇదిలా ఉండగా నవంబర్ 10న ఆయన హాస్పిటల్ లో చేరడంతో నిన్న ఆయన బృందం ధర్మేంద్ర శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మరణించారు అంటూ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. దీంతో ఏ మీడియా ఛానల్ చూసినా.. వార్తాపత్రిక చూసినా హీరో ధర్మేంద్ర మరణించారంటూ వార్తలు ప్రచారం చేశారు. అంతేకాదు ఇది నిజం అని నమ్మిన సెలబ్రిటీలు, అభిమానులు ధర్మేంద్ర మరణానికి సంతాపం తెలియజేస్తూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.
అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా.. “శ్రీధర్మ్ జీ కేవలం ఒక లెజెండ్రీ నటుడు మాత్రమే కాదు అసమాన్యమైన మనిషి కూడా.. ప్రతిసారి ఆయనను కలిసినప్పుడు ఆయనలోని వినమ్రత, ఆప్యాయత నా హృదయాన్ని తాకాయి. ఆయనతో గడిపిన ఆ స్నేహపూర్వక క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఈయన మాత్రమే కాదు మరికొంతమంది విషయం తెలిసిన వెంటనే.. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు కూడా ఆయన మరణానికి సంతాపం తెలియజేశారు.
ఇకపోతే ధర్మేంద్ర మరణించారంటూ వార్తలు రావడంతో ఈ విషయంపై ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ (Esha Deol) స్పందించారు. “మా నాన్న చనిపోలేదు.. అసత్య వార్తలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు” అంటూ ఆమె మండిపడ్డారు అలాగే హేమమాలిని కూడా స్పందిస్తూ..” చికిత్సకు సహకరిస్తున్న ఒక వ్యక్తి గురించి ఇలా తప్పుడు వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం.. దయచేసి అసలు వార్తలు ఏంటి? నిజాలు ఏంటి? అని తెలుసుకొని వార్తలు రాయాలి” అంటూ మీడియాపై కూడా మండిపడ్డారు.