Tollywood:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తెరపై కనిపించే సెలబ్రిటీలు తెర వెనుక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చాలామందికి తెలియదనే చెప్పాలి. అయితే అందులో కొంతమంది ధైర్యంగా సమస్యలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటే.. మరికొంతమంది లోలోపలే కృంగిపోతూ ఉంటారు. ఇకపోతే మరికొంతమంది తమ అనారోగ్య సమస్యలను బహిర్గతం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే ఇలాంటి సమస్యల వల్ల ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా చెబుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ సమీరా రెడ్డి (Sameera Reddy)కూడా ఒకరు. తాజాగా తన చిన్నతనంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి,తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పుకొచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి మాట్లాడుతూ..” నేను చిన్న వయసులోనే నత్తి సమస్య అనుభవించాను. దానివల్ల ఎన్నో వేధింపులకు గురయ్యాను. క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాను. ఇకపోతే నన్ను నేను మార్చుకొని మళ్లీ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో ఏళ్లపాటు థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికి నేను మాట్లాడేటప్పుడు తడబడితే.. ఎవరైనా వింతగా చూస్తే అది నన్ను చాలా బాధ పెడుతోంది. ముఖ్యంగా చిన్నప్పుడు మనపై వేసే ముద్ర మన మనసులో ఎంత బలంగా నాటుకు పోతుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. అందుకే పిల్లల్ని మనం పిలిచే విధానం కూడా వారిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మసులుకోవాలి ముఖ్యంగా వారిపై వేసే చిన్నపాటి ముద్రలే వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి మాటలు పిల్లలు పదే పదే వినడం వల్ల కొత్త విషయాలను నేర్చుకోవడానికి కూడా భయపడతారు. ముఖ్యంగా ఆ అపనమ్మకం వారి వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. చివరికి తాము ఏం చేయలేమనే భావనకు వచ్చేస్తారు. ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది” అంటూ సమీరారెడ్డి తెలిపింది. మొత్తానికైతే తనకు ఉన్న నత్తి సమస్య కారణంగా తనను చాలామంది హేళన చేశారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది సమీరారెడ్డి.
ఇకపోతే ఇదే విషయంపై ఆమె మళ్ళీ మాట్లాడుతూ.. ఒక్క విషయంలో వెనుకబడి ఉన్నంత మాత్రాన అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు అని నేను నా పిల్లలకు చెబుతూ ఉంటాను. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడమే నా మొదటి లక్ష్యం. పిల్లలకి ప్రోత్సాహం, మద్దతు లభించినప్పుడు వారిలో సహజంగా పట్టుదల పెరుగుతుంది. విమర్శలకు బదులుగా మద్దతును అందించినప్పుడే వారు సవాళ్లను అధిగమించి కొత్తది నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు “అంటూ సమీరారెడ్డి తెలిపింది. ప్రస్తుతం సమీరా రెడ్డి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Film industry: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. సూపర్ మ్యాన్ నటి మృతి!
సమీరా రెడ్డి విషయానికి వస్తే.. తెలుగు, బెంగాలీ, మలయాళం ,కన్నడ చిత్రాలలో నటించిన ఈమె హిందీ చిత్రాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో అశోక్, జై చిరంజీవ, నరసింహుడు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక 2012లో కృష్ణం వందే జగద్గురు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆకట్టుకున్న ఈమె మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.