Theatre System: ఆడియన్స్ OTT లకి అలవాటు పడిపోవడంతో డీలా పడ్డ థియేటర్ వ్యవస్థ ఇపుడు నిలబడటానికి సరికొత్త మార్గాలని అన్వేషించే పనిలో పడింది. అందులోభాగంగా హైదరాబాద్లోని 23 ప్రముఖ సింగిల్ థియేటర్లు మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ సిస్టమ్లోకి మారిపోతున్నాయి. సో మొదటి వారం వచ్చిన వసూళ్లలో 60% రెండో వారం 50% మూడో వారం 40% వాటాలు థియేటర్లు ఈ తీసుకోబోతున్నాయ్.అంటే ఇప్పటివరకు సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా థియేటర్ యజమానులకు అద్దె వచ్చేది. కానీ ఇప్పుడు హైదరాబాద్లోని ఈశ్వర్, గోకుల్, శ్రీరాములు, అర్జున్, భ్రమరాంబ వంటి 23 థియేటర్లు డిస్ట్రిబ్యూటర్లతో కొత్త అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం పర్సంటేజీలు పంచుకోబోతున్నాయి.అంటే సినిమా హిట్ అయితే డిస్ట్రిబ్యూటర్ కంటే థియేటర్ వాళ్ళే ఎక్కువ వెనకేస్తారన్నమాట. పైగా ఒక హౌస్ఫుల్ షో గ్రాస్ను ‘హోల్డ్-ఓవర్’ పేరుతో తమ దగ్గరే ఉంచుకోబోతున్నారు కూడా మంచిదే. సింగిల్ స్క్రీన్స్ ని నిలబెట్టాలన్న తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుంది.
కామన్ ఆడియన్ అడిగే ప్రశ్న ఒక్కటే..
థియేటర్ యజమానులు చెబుతున్న కారణం “మావి ప్రైమ్ లొకేషన్లు, మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి” అని. కానీ కామన్ ఆడియన్ అడిగే ప్రశ్న ఒక్కటే.. “ఖర్చు పెడుతున్నారు సరే, మరి ఆ ఫెసిలిటీస్ ఎక్కడా అని.మల్టీప్లెక్సుల్లో నీట్ గా ఉంటాయి కాబట్టి పర్సంటేజీ అంటే ఒక అర్థం ఉంది.మరి మల్టీప్లెక్సుల్లా నీట్ గా ఈ సింగిల్ స్క్రీన్ ఉంటాయా అనేదే ప్రశ్న.హైదరాబాద్లోని కొన్ని థియేటర్లు తప్పిస్తే , మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో మెయింటెనెన్స్ ఎంత చెత్తగా ఉంటుందో చెప్పక్కర్లేదు .సింగిల్ స్క్రీన్లలో బాత్రూమ్ కి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.పైగా సింగిల్ స్క్రీన్ లలో చాలా వరకు సీట్లు విరిగిపోయి ఉంటాయి,ఇక ఏసీ పేరుకే ఉంటుంది కానీ అదెప్పుడు ఆన్ అవుతుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో థియేటర్ వాళ్ళకే ఎరుక. మరి ఇంత దారుణమైన సర్వీస్ ఇస్తూ, మల్టీప్లెక్స్ రేంజ్ లో పర్సంటేజీలు అడగడం ఏంటని ఇప్పటికే తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
also read:మందు బాబులూ … ఒక పెగ్గే కదా అని లైట్ తీసుకుంటున్నారా?
ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ ఇద్దరూ ఒక్కరే
ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగా సింగిల్ స్క్రీన్స్ పెద్ద ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లో (లీజులో) ఉన్నాయి. అంటే ఇక్కడ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ ఇద్దరూ ఒక్కరే అన్న మాట ! ఈ పర్సంటేజీ ఒప్పందం వల్ల వచ్చే లాభం కూడా ఆ పెద్దల జేబుల్లోకే వెళ్తుంది తప్ప, థియేటర్లను నమ్ముకున్న అసలైన యజమానులకు ఎంత అందుతుందనేది మిస్టరీనే.
ఏపీలో కూడా అమలు చేస్తారట
ఇక మొదటగా హైదరాబాద్లో క్లిక్ అయితే ఈ పద్ధతిని నైజాం అంతా, ఆ తర్వాత ఏపీలో కూడా అమలు చేస్తారట. మరి మేజర్ హైదరాబాద్ సిటీలోనే మెయింటెనెన్స్ ఇంత దారుణంగా ఉంటె ఇక సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో థియేటర్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.చూస్తుంటే థియేటర్ల వైపు జనాన్ని లాగుతున్నట్టు లేదు. ఫెసిలిటీస్ పెంచకుండా కేవలం వసూళ్ల మీద కన్నేసిన థియేటర్ల తీరు చూస్తుంటే ఇంకా ఓటీటీల వైపు నెట్టేస్తున్నారా అన్న డౌట్ రైజ్ అవుతుంది. ఏది ఏమైనా రేట్లు పెంచడంలో, పర్సంటేజీలు గుంజడంలో ఉన్న ఉత్సాహం.. థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో లేకపోవడం తెలుగు సినిమా ప్రేక్షకుడు చేసుకున్న దురదృష్టం !
also read:‘సువర్ణ’ మూవీ రివ్యూ.. రీల్స్ పిచ్చితో భవిష్యత్తును బలి చేసుకుంటున్నారా?