Tharun Bhascker: తెలుగు సినిమా రంగంలో కొత్త తరహా కథలతో.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలు కొత్త తరం ఆలోచనలను సహజంగా చూపించడంతో తరుణ్ భాస్కర్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. అయితే ఈ విజయాల తర్వాత ఆయన ప్రయాణం అంత సాఫీగా సాగలేదని కూడా చెప్పాలి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో ఆయన కెరీర్లో కొంత గ్యాప్ వచ్చింది.
ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ సమయంలో తరుణ్ భాస్కర్ సినిమా ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా “ఒకే కుటుంబం సినిమా పరిశ్రమను పాలిస్తోంది” అనే భావనపై ఆయన స్పందన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలామంది తమను తాము ‘ఔట్సైడర్’గా భావించుకుంటూ అవకాశాలు రావడం లేదని అనుకుంటారని, కానీ అది పూర్తిగా మన మనసులోనే పుట్టే ఆలోచన మాత్రమేనని ఆయన చెప్పారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, సినిమా అనేది చివరికి ఒక టెక్నికల్ ప్రోడక్ట్ మాత్రమే అని స్పష్టంగా వివరించారు. మంచి వీడియో క్వాలిటీ, సౌండ్ ఉండే రెండు నుంచి మూడు గంటల ఫైల్ను సర్వర్లో అప్లోడ్ చేసి ప్రేక్షకులకు అందించడమే సినిమా అని అన్నారు. “నేను ఔట్సైడర్ని” అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తే, మనం మానసికంగా ఎప్పటికీ ఔట్సైడర్గానే మిగిలిపోతామని ఆయన అభిప్రాయం. అలాంటి ఆలోచనలను పక్కన పెట్టి, మన పనిపై నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తరుణ్ భాస్కర్ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన ఓం శాంతి శాంతి శాంతిహి అనే కామెడీ డ్రామా సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆయనతో పాటు ఈషా రెబ్బా కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు ఏ.ఆర్. సంజీవ్ దర్శకత్వం వహించగా, ఎస్ఎస్ ఒరిజినల్స్ మరియు మూవీ వర్స్ స్టూడియోస్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాయి.
ఈ సినిమా అసలు మలయాళ చిత్రం జయ జయ జయ హేకి తెలుగు రీమేక్. భార్యాభర్తల మధ్య జరిగే సమస్యలు, భావోద్వేగాలను సరదాగా చూపిస్తూ బలమైన సందేశాన్ని అందిస్తుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫిబ్రవరి మూడో వారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ALSO READ: Sri Chidambaram Review: ‘శ్రీ చిదంబరం గారు’ మూవీ రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే..!