భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘యంత్ర ఇండియా లిమిటెడ్’ (YIL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఐటీఐ పూర్తి చేసిన వారితో పాటు, కేవలం పదో తరగతి అర్హత ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం విశేషం.
ఖాళీల వివరాలవే..
మొత్తం 3,979 ఖాళీలలో రెండు రకాల కేటగిరీలు ఉన్నాయి. గతంలో ఐటీఐ పూర్తి చేసిన వారి కోసం ఎక్స్-ఐటీఐ విభాగంలో 2,843 పోస్టులు, ఐటీఐ లేని అభ్యర్థుల కోసం నాన్-ఐటీఐ విభాగంలో 1,136 పోస్టులు కేటాయించారు. ప్రధానంగా మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్ వంటి ట్రేడుల్లో ఈ శిక్షణ ఉంటుంది.
విద్యార్హత, వయస్సు వివరాలివే..
నాన్-ఐటీఐ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎక్స్-ఐటీఐ అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఎన్సీవీటీ (NCVT) లేదా ఎస్సీవీటీ (SCVT) గుర్తింపు పొందిన ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయస్సు..
వయోపరిమితి విషయానికి వస్తే, 2026 మార్చి 3 నాటికి అభ్యర్థుల వయస్సు 14 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.
ఉద్యోగ ఎంపిక విధానం, స్టైపెండ్..
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు తమ విద్యార్హతల్లో (పదో తరగతి, ఐటీఐ) సాధించిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 8,200 నుంచి రూ. 9,600 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ..
ఆసక్తి గల అభ్యర్థులు యంత్ర ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ 2026 ఫిబ్రవరి 1న ప్రారంభమై, మార్చి 3వ తేదీతో ముగుస్తుంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. రక్షణ రంగ సంస్థలో శిక్షణ పొంది, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.recruit-gov.com/
ALSO READ: Galaxy A07 5G: 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో శాంసంగ్ బడ్జెట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే