Kajol : బాలీవుడ్ వెండితెరపై ఎన్నో అద్భుతమైన ప్రేమకథల్లో నటించి మెప్పించిన కాజోల్, ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలతో పెద్ద చిక్కుల్లో పడ్డారు. ఒక ప్రముఖ ఓటీటీ టాక్ షోలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధానికి దారితీశాయి.
అసలు కాజోల్ ఏమన్నారు?
ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా నిర్వహిస్తున్న షోలో కాజోల్ మాట్లాడుతూ.. పెళ్లికి కూడా వస్తువుల లాగే ఒక ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఆ గడువు ముగిశాక, ఇద్దరికీ ఇష్టమైతేనే రీన్యువల్ చేసుకునే ఆప్షన్ ఉండాలి. నచ్చని వ్యక్తితో బలవంతంగా ఎందుకు జీవించాలి? అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మాటలకు ట్వింకిల్ ఖన్నా వంత పాడగా, అక్కడే ఉన్న హీరో విక్కీ కౌశల్,హీరోయిన్ కృతి సనన్ మాత్రం షాక్ అయ్యారు. పెళ్లి అనేది పవిత్రమైన బంధమని, ఇలాంటి ఆలోచనలు సరికాదని వారు సున్నితంగానే వ్యతిరేకించారు.
నెటిజన్ల ఆగ్రహం.
కాజోల్ వ్యాఖ్యలు బయటకు రాగానే నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. సెలబ్రిటీలు నోటికొచ్చినట్లు మాట్లాడి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? సంస్కృతి, సంప్రదాయాలను అవమానించడమే హాస్యమా? అంటూ మండిపడ్డారు. కాజోల్ తన భర్త అజయ్ దేవగన్తో దశాబ్దాలుగా కాపురం చేస్తూ, ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని కొందరు ప్రశ్నించారు.
సరదా మాటలా? స్క్రిప్ట్ మాయా?
విమర్శలు మిన్నంటడంతో కాజోల్ ఎట్టకేలకు స్పందించారు. అది కేవలం షోలో సరదాగా చేసిన చర్చ మాత్రమేనని, దానిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. ట్వింకిల్ ఖన్నా కూడా ఇది పూర్తిగా కామెడీ కోణంలో సాగిన సంభాషణ అని, ప్రతి ఎపిసోడ్కు ముందు డిస్క్లైమర్ కూడా ఇస్తున్నామని వివరణ ఇచ్చారు.
అయినప్పటికీ, నెటిజన్ల కోపం మాత్రం తగ్గడం లేదు. తప్పుగా మాట్లాడేసి ఆ తర్వాత అది కామెడీ అనడం సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శిస్తున్నారు. నిజానికి కాజోల్ వివాదాలకు దూరంగా ఉండే నటి, కానీ ఈసారి ఆమె ఫ్లోలో అన్న మాటలు ఆమె అభిమానులను కూడా హర్ట్ చేశాయనే చెప్పాలి. కామెడీ పేరుతో విలువైన వ్యవస్థలను తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు బాలీవుడ్ టాక్ షోలలో ఒక ట్రెండ్లా మారుతోంది. ఈ వివాదం కాజోల్ ఇమేజ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.