Kangana Ranaut: బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ ఆలయాల్లో పూజలు చేయాలనుకునే హిందూయేతరులు ఇకపై తప్పనిసరిగా అఫిడవిట్ సమర్పించాలనే కొత్త నిబంధనను కమిటీ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 17న కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘సారా అలీ ఖాన్ వంటి వారు తరచుగా కేదార్నాథ్ను సందర్శిస్తుంటారు. ఈ కొత్త నిబంధన ఆమెకు కూడా వర్తిస్తుందా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు, ఆమె సనాతన ధర్మంపై తనకున్న భక్తిని చాటుతూ అఫిడవిట్ ఇస్తే తప్పకుండా దర్శనానికి అనుమతిస్తామని ఛైర్మన్ తెలిపారు. ప్రస్తుతం ఈ నూతన నిబంధనపై చర్చ జరుగుతుండగా.. ఎంపీ, నటి కంగనా రనౌత్ ఈ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read- TGFA 2025: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025కు అంతా సిద్ధం.. ఈవెంట్ వివరాలివే!
‘సత్యాన్ని రాయడానికి భయం ఎందుకు? ఇక్కడ ఉన్నవారంతా సనాతనులే. సనాతనం అంటే ఆది, అంతం లేనిది. అన్ని మతాలు 1000-1500 ఏళ్ల నాటివే, అవి కూడా సనాతన ధర్మం నుండే వచ్చాయి. అలాంటప్పుడు నిజాన్ని రాయడానికి సంకోచం ఎందుకు? రాసి ఇచ్చేయండి’’ అని కంగనా రనౌత్ ఈ నూతన నిబంధనపై స్పందించారు. ప్రస్తుతానికి ఈ అఫిడవిట్ నిబంధనపై సారా అలీ ఖాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు కానీ, ఈ నిబంధన ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ అవుతోంది. కారణం, ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలే. ‘కేదార్నాథ్ పర్యటన నా వ్యక్తిగత విషయం, అక్కడ నాకు ప్రశాంతత లభిస్తుంది’ అని సారా అలీ ఖాన్ గతంలో పబ్లిగ్గా ప్రకటించారు. అందుకే ఇప్పుడామె పేరు వైరల్ అవుతుంది. అందులోనూ ఆమె మొదటి చిత్రమే ‘కేదార్నాథ్’ కావడం విశేషం.
Also Read- Ken Karunaas: ఇప్పటి వరకు నాది.. ఇకపై మీది.. ‘యూత్’ హీరో ఎమోషనల్ పోస్ట్ వైరల్!
సారా అలీ ఖాన్ తన ఆధ్యాత్మిక యాత్రల గురించి, ముఖ్యంగా కేదార్నాథ్ సందర్శనల గురించి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. ఇలా ఓసారి జాన్వీ కపూర్ అండ్ టీమ్తో కలిసి వెళ్లినప్పుడు భైరవనాథ్ వెళ్లామని, అక్కడ చిక్కుకు పోయామని, చివరకు స్పెషల్ ఫోర్సెస్ వచ్చి రక్షించినట్లుగా తెలిపింది. ఆ భయానక సంఘటన తర్వాత కూడా ఆమె ఇలాంటి సందర్శనలు చేసినట్లుగా చెప్పారు. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన నిబంధనను ఆమె ఎలా ఫాలో అవుతుందో? అఫిడవిట్ సమర్పించి దర్శనం చేసుకుంటుందో, లేదో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికైతే ఆమె పేరు మీద ఇలాంటి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కంగనా చెప్పినట్లుగా.. రావద్దని ఏం అనడం లేదు కదా.. ఎవరైనా రావచ్చు. కాకపోతే.. హిందూయేతరులు కాబట్టి.. అఫిడవిట్ సమర్పించి వెళితే ఏ గోల ఉండదు. తిరుమలలో కూడా ఈ విషయంపైనే కదా రచ్చ జరుగుతుంది.
Also Read- Sreeleela: మహేష్ వివాదం… క్లారిటీ ఇచ్చిన శ్రీలీల..రూమర్లకు చెక్ పెట్టిందా?