Maargan: అసలు కొన్ని సినిమాలు ఎందుకు థియేటర్ లో రిలీజ్ అవుతాయో.. అప్పుడే ఎందుకు ఓటీటీలోకి వస్తాయో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు.. నెల కూడా తిరక్కముందే ఓటీటీలో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. థియేటర్ లో హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఓటీటీలో హిట్ అవుతుంది. ఓటీటీ కోసం తెరకెక్కించిన సినిమాలు కూడా ఓటీటీలోనే హిట్ అవ్వడం. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఓటీటీలో కథ నచ్చితే ప్రేక్షకులు ఎలాంటి మొహమాటం లేకుండా హిట్ చేస్తున్నారు.
తాజాగా విజయ్ ఆంటోనీ మార్గన్ సినిమా ఓటీటీలోకి వచ్చి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. బిచ్చగాడు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ.. ఆ తరువాత బిచ్చగాడు 2 తో మరోసారి మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు తప్ప.. విజయ్ ఆంటోనీకి మరో సినిమా కలిసి రావడం లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో వస్తున్నా కూడా ఒక్క సినిమా కూడా విజయాన్ని అందుకోలేక పోతుంది. ఇక గతనెల విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం మార్గన్. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 27 న రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఇక మార్గన్ సినిమాతో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిషాన్ విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందించలేకపోవడంతో మేకర్స్ సడెన్ గా ఓటీటీలో చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ చేస్తున్నారు. నేటి నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో సడెన్ గా ఈ సినిమాను ఓటీటీలో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
మార్గన్ కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో రమ్యఅనే యువతీ దారుణ హత్యకు గురవుతుంది. ఆమె బాడీ మొత్తం నల్లగా మారిపోయి.. చెత్తబుట్టలో దొరుకుతుంది. ఇక ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు డీజీపీ ధృవ్ కుమార్ (విజయ్ ఆంటోనీ) దృష్టికీ వస్తుంది. అప్పటికే ఇదే విధంగా తన కూతురును పోగొట్టుకొని పగతో రగిలిపోయే ధృవ్.. ఆ హంతకుడును వెతికే పనిలో పడతాడు. ఆధారాలు, సాక్ష్యాలు అన్ని ధృవ్ ను.. డి అరవింద్ (అరవింద్ దిషాన్ ) వద్దకు చేరుస్తాయి. వెంటనే అతనిని అదుపులోకి తీసుకొని ధృవ్ విచారిస్తూ ఉంటాడు. అయితే అమ్మాయిల హత్య చేయడం వెనుక అరవింద్ కు ఉన్న మోటివ్ ఏంటి.. ? ధృవ్ కుమార్తెను ఎందుకు చంపాల్సివచ్చింది.. ? అసలు అరవింద్ కు ఈ హత్యలకు సంబంధం ఏంటి.. ? చివరకు ధృవ్ తన కూతురును చంపినవాడిని పట్టుకున్నాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను కొత్తేమి కాదు. కాకపోతే ఒక్కో సినిమాలో ఒక్కో ప్యాట్రన్ ను ఉపయోగించడం వలన క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇక ఇందులో ముఖం మొత్తం నలుపు అవ్వడం అనే కొత్త లైన్ ను తీసుకున్నారు. అదే సినిమాకు హైలైట్ అని చెపుచ్చు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.