Mirai Actor: నేపాల్కు చెందిన ప్రముఖ నటుడు సునీల్ థాపా కన్నుమూయడం సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. 68 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఖాట్మండులోని నార్విక్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. అధికారిక వైద్య నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఈయన ఈ మధ్యనే తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన మిరాయి చిత్రంలో కనిపించారు.
సునీల్ థాపా నేపాల్లోని డాంగ్ ప్రాంతంలో జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణం ఎంతో గొప్పది. సుమారు 40 ఏళ్ల కెరీర్లో 300కు పైగా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఎక్కువగా నేపాలీ సినిమాల్లో నటించినప్పటికీ, బాలీవుడ్ మరియు భోజ్పురి చిత్రాల్లో కూడా కనిపించారు. నటుడిగా మాత్రమే కాకుండా, పాత్రకు ప్రాణం పోసే కళాకారుడిగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచారు.
బాలీవుడ్లో ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో వచ్చిన ‘మేరీ కోమ్’ సినిమాలో కోచ్ పాత్రలో సునీల్ థాపా నటించారు. ఆ పాత్ర ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే తెలుగులో వచ్చిన ‘మిరాయ్’ సినిమాలో కూడా ఆయన కీలక పాత్రలో కనిపించారు. భాష ఏదైనా, పాత్ర చిన్నదైనా పెద్దదైనా, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత.
నేపాలీ సినిమాల్లో ప్రతినాయక పాత్రలతో సునీల్ థాపా మరింత ప్రసిద్ధి చెందారు. ‘చినో’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో కూడా పనిచేశారు. తరువాత హిందీ సినిమా ‘ఏక్ దూజే కే లియే’తో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.
నటనతో పాటు సినీ రంగ అభివృద్ధికి కూడా ఆయన కృషి చేశారు. ఎవెరెస్ట్ ఫిల్మ్ అకాడమీ చైర్మన్గా వ్యవహరిస్తూ యువ కళాకారులకు మార్గనిర్దేశం చేశారు. సునీల్ థాపా మరణంపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మరణం నేపాలీతో పాటు భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయి.
ALSO READ: Rashmika Mandanna: డార్క్ పాత్రలో రష్మిక.. AA24 సినిమాలో ఎప్పుడూ లేనంత వైలెంట్గా..!