Medaram Jatara 2026: మానవులకు ఏ కష్టం వచ్చినా అంతిమంగా భగవంతుడ్నే ఆశ్రయిస్తారు. తమ కోరికలు, కష్టాలు తిరిపోవాలని ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా తమ పరిధిలో లేని విషయాల కోసం ఎక్కువగా దేవుడిపైనే భారం వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మేడారం జాతరకు వచ్చిన భక్తులు సైతం వనదేవతలను దర్శించుకొని మెుక్కులు చెల్లించుకున్నారు. అయితే వారిలో కొందరు భక్తులు కోరుకున్న కోరికలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని కోరికలు భావోద్వేగానికి గురిచేస్తే.. మరికొన్ని కోరికలు నవ్వులు పూయిస్తున్నాయి.
మేడారం మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వందలాది హుండీలను గురువారం నుంచి లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల కోరికలకు సంబంధించి కొన్ని లెటర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన కొడుకు నుంచి తమని రక్షించాలని రూ.100 నోటుపై తల్లిదండ్రులు రాయడం ప్రతీ ఒక్కరినీ కలిచి వేసింది. అదే విధంగా తమ ప్రేమను గెలిపించాలంటూ కొన్ని ప్రేమ లేఖలు సైతం హుండీ లెక్కింపులో బయటపడ్డాయి. అలాగే ఓ భక్తుడు.. తన తల్లి ఆస్తి మెుత్తం తనకే దక్కాలంటూ వనదేవతలను కోరుకున్నాడు. తమ కోరికలను పరిష్కరిస్తే రెండేళ్ల తర్వాత మహా జాతరకు మళ్లీ వచ్చి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటాని పెట్టుకున్నారు. మెుత్తంగా హుండీలో వచ్చిన ఆదాయం కంటే భక్తుల వింత కోరికలే.. అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుండటం విశేషం.
ఇదిలా ఉంటే ప్రపంచంలోనే గిరిజన జాతరగా, దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతరలో మొత్తం 828 హుండీలను ఆలయ అధికారులు, ఆదివాసి అర్చకులు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో చేపట్టారు. తొలి రోజు 125 హుండీలను లెక్కబెట్టిన ఆలయ పూజారులు, ఎండోమెంట్ అధికారులు రూ. 2.49 కోట్లుగా తేల్చారు. రెండో రోజైన శుక్రవారం 160 హుండీలను లెక్కించి రూ. 3 కోట్ల 54 లక్షలు వచ్చినట్లు లెక్కలు చెప్పారు. అయితే మొత్తం 828 హుండీలకు గాను 788 హుండీల్లోనే భక్తులు కానుకలు వేసినట్లుగా గుర్తించారు. తొలి రెండ్రోజుల్లో 285 హుండీలను లెక్కించగా.. రూ. 6 కోట్ల 4 లక్షల 53 వేల 636 ఆదాయం వచ్చింది.
Also Read: Epstein Files: స్వీడిష్ అందగత్తెతో అనిల్ అంబానీ? ఎప్స్టిన్ ఫైల్స్లో సంచలనం.. ఇది నిజమేనా?
మేడారం మహా జాతరలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవాదాయ శాఖకు 67%, గిరిజనులకు 33 జీతం అందజేయాల్సి ఉంటుందని మేడారం ఆలయ ఈవో వీరేశం వెల్లడించారు. 33 శాతంలో 13 శాతం వాటాను గిరిజన ఆదివాసి దేవతల వంశస్తులకు అందిస్తారు. పగిడిద్దరాజు (1%), గోవిందరాజు (1%), సమ్మక్క (5%), సారలమ్మ (6%) పూజారులకు హుండీ ఆదాయం పంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సారలమ్మతో పోలిస్తే సమ్మక్క పూజారులకు 1 శాతం హుండీ ఆదాయం తక్కువ ఇవ్వడంపై చాలా కాలంగా ఆందోళనలు ఉన్నాయి. కాగా, దేవాదాయశాఖకు చెందిన 67 శాతం హుండీ ఆదాయాన్ని మెుదట బ్యాంక్ ఖాతాలో జమ చేసిన తర్వాతనే మిగిలిన ఆదాయాన్ని గిరిజన అర్చకులకు అందజేయనుండటం గమనార్హం.
Also Read: BJP – Janasena Alliance: బీజేపీ-జనసేన పొత్తుకు బీటలు? వెనక్కితగ్గిన కమలం.. మున్సిపోరులో ఒంటరిగానే?