NTR Paediatrician: సినీ వెండితెరపై నటనతో మెప్పించే యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), ఒకవేళ స్టెతస్కోప్ పడితే ఏ విభాగంలో ఉండేవారో వెల్లడించారు. బెంగళూరులో జరిగిన కిమ్స్ (KIMS) హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ గురువారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానమిస్తూ, తాను ఒకవేళ డాక్టర్ అయ్యి ఉంటే కచ్చితంగా ‘పీడియాట్రీషియన్’ (పిల్లల వైద్యుడు) అయ్యేవాడినని పేర్కొన్నారు. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, వారి ఎదుగుదలను చూడటంలో ఒక ప్రత్యేకమైన అందం ఆనందం ఉంటుందని ఆయన వివరించారు.
వైద్య వృత్తి పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని ఎన్టీఆర్ ఈ వేదికపై చాటుకున్నారు. ప్రాణాలను కాపాడే అవకాశం మరియు ఒక వ్యక్తికి రెండో జీవితాన్ని ఇచ్చే అదృష్టం కేవలం వైద్యులకే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఇదే సమయంలో డాక్టర్ గురువారెడ్డి చమత్కరిస్తూ, “మీరు ఆర్థోపెడిక్ సర్జన్ అవుతారని అనుకున్నాను” అని అనగా.. “ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వాలంటే మీ అంత ప్రతిభ ఉండాలి, అది నా వల్ల కాదు” అంటూ ఎన్టీఆర్ నవ్వుతూ సమాధానమిచ్చారు. కేవలం వృత్తిపరమైన విషయాలే కాకుండా, తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ‘కష్టపడటం’ మాత్రమే విజయానికి ఏకైక మార్గమని తాను నమ్ముతానని ఆయన స్పష్టం చేశారు.
Read also-Trisha Controversy: వైరల్ వీడియో వివాదంలో పార్థిబన్పై సీరియస్ అయిన నటి త్రిష
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సామాజిక అంశాలపై కూడా స్పందించారు. ముఖ్యంగా మహిళల భద్రత మరియు ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ప్రతి పురుషుడు మహిళలను గౌరవించడం అనేది ఇంట్లోనే నేర్చుకోవాలని, తన ఇద్దరు కుమారులను అలాగే పెంచుతానని హామీ ఇచ్చారు. అలాగే రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, తన కుటుంబంలో జరిగిన విషాదాలను గుర్తుచేసుకున్నారు. వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల ముఖాలను గుర్తు తెచ్చుకుంటే బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేస్తారని హితవు పలికారు. సినిమా వేడుకల్లోనే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్ తన పరిణతిని చాటుకోవడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.