CS Extension: స్వేచ్చ బ్యూరో: సీఎస్ రామకృష్ణారావుకు మరో 3 నెలల ఎక్స్ టెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసినట్లు సమాచారం. ఈనెల 31 తో సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ముగుస్తున్నందున మరో 3 నెలల పాటు పొడిగించాలని సీఎం కోరినట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాలు, జనగణనల నేపథ్యంలో సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. వాస్తవానికి ఆగస్టు 2025తోనే సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ముగిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు 7 నెలల పాటు పొడిగించారు. ఇప్పుడు మళ్లీ మరో మూడు నెలలు ఎక్స్ టెన్షన్ కోరుతూ ప్రభుత్వం ప్రత్యేక లేఖ రాసింది. కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందనేది? సస్పెన్షన్ మారింది. ఇక మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సీఎస్ లకు ఏడాదిపాటు పదవీకాలం పొడిగిస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఉత్తరప్రదేశ్ సీఎస్ కు అయితే ఏకంగా రెండేళ్ల పాటు పదవీకాలం పొడిగించారు. దీంతో రామకృష్ణారావు పొడిగింపు కూడా సాధ్యమేననే టాక్ కూడా వినిపిస్తుంది. పైగా కేవలం మూడు నెలలే కోరినందున కేంద్రం అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉన్నదని అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రెసిడ్యూయరీ రూల్స్ ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్లో ఏ నిబంధననైనా సడలించుకునే వెసులుబాటు ఉంటుందని, రూల్ 3 ప్రకారమే రాష్ట్ర అవసరాల మేరకు రామకృష్ణారావుకు మరోసారి పదవి కాలం పొడిగించే ఛాన్స్ ఉన్నదని చెప్తున్నారు. మార్చి 20 లోపు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎం రాసిన లేఖకు రిప్లై వచ్చే ఛాన్స్ ఉన్నది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానున్నది.
ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలం 31 మార్చి 2026తో ముగియనున్నది. దీంతో నే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం అంగీకరించకపోతే కొత్త సీఎస్ కొరకు సీనియర్ ఐఏఎస్ వివరాలను కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రధానంగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ పేర్లు వినిపిస్తున్నాయి. 1992 బ్యాచ్ కు చెందిన జయేష్ రంజన్ కు పరిపాలనపై పట్టు, ఐటీ, పారిశ్రామిక రంగాలలో సుదీర్ఘ అనుభవం ఉండటం కలిసి వస్తుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఇక 1992 బ్యాచ్ కు చెందిన వికాస్ రాజ్కు ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర, పరిపాలనాపరమైన అనుభవం, 2028 వరకు సర్వీస్ ఉండటం కలిసొచ్చే అంశంగా మారింది. 1994 బ్యాచ్ కు చెందిన సవ్యసాచి ఘోష్ 1994 సీనియారిటీ పరంగా రేసులో నిలుస్తున్నారు. మరోవైపు అరవింద్ కుమార్ వంటి సీనియర్ అధికారులు రేసులో ఉన్నప్పటికీ, ఫార్ములా-ఈ రేస్ కేస్ లో కేంద్రం ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంతో వెనకబడ్డారు.ఇదిలా ఉండగా కేంద్రం రామకృష్ణారావు ఎక్స్ టెన్షన్ కు అనుమతి ఇవ్వకపోతే ఏప్రిల్ లో కొత్త సీఎస్ ను నియమించాల్సి ఉంటుంది.
Also Read: BRS party: బీఆర్ఎస్ పార్టీలో కనబడని కీలక మాజీ మంత్రులు..?