Nandi vs Gaddar: తెలంగాణలో ‘గద్దర్ అవార్డుల’ సందడి మొదలవ్వడంతో ఇప్పుడు అందరి కళ్లు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లాయి. ‘మాకు నంది అవార్డులు కావాలి’ అని ఆర్. నారాయణమూర్తి వంటి వారు డిమాండ్ చేస్తున్నారు ,కాని ఏపీ ప్రభుత్వం మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టే కనిపిస్తుంది .యస్ ..ఎన్నో సార్లు ఎన్నో విజ్ఞప్తులు వచ్చినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నంది అవార్డుల ఊసెత్తకపోవడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.
‘వన్ వే’ ట్రాఫిక్ లాంటి టాలీవుడ్ బంధం!
నిజానికి ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల ఎంతో ఉదారంగా ఉంటోంది. పెద్ద సినిమాల రిలీజ్ టైమ్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అదనపు షోలకు వెంటనే అనుమతి ఇస్తోంది. కానీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా కోరినా.. పరిశ్రమను ఏపీకి తరలించడానికి ఏ హీరో, నిర్మాత ముందుకు రావడం లేదు. ‘లాభాలు ఏపీ నుంచి కావాలి.. పెట్టుబడులు మాత్రం హైదరాబాద్లోనే పెడతాం’ అనే టాలీవుడ్ ధోరణి ప్రభుత్వానికి నచ్చడం లేదు. ‘మీరు మాకు సహకరించనప్పుడు, మేము మీకు అవార్డులు ఇవ్వడం దేనికి?’ అనే భావన సర్కార్లో కనిపిస్తోంది.
‘సొంత డబ్బా’ అనే ముద్ర పడకుండా జాగ్రత్త!
మరో వైపు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగబాబు వంటి సినీ దిగ్గజాలు కీలక పదవుల్లో ఉన్నారు. ఈ తరుణంలో నంది అవార్డులు ప్రకటిస్తే.. విన్నర్స్ లిస్టులో ఎవరున్నా సరే, ‘తమ వాళ్లకే ఇచ్చుకున్నారు’ అనే విమర్శలు రావడం ఖాయం. మరో వైపు ప్రతిపక్షం వైసీపీ కూడా కౌంటర్ వేయడానికి సిద్ధంగా ఉంటుంది. దీంతో ఈ రాజకీయ బురదలోకి వెళ్ళడం కంటే, అవార్డులను పక్కన పెట్టడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది.
గద్దర్ అవార్డుల ఎఫెక్ట్.. మళ్ళీ రాజకీయాలా?
అయితే తెలంగాణలో గద్దర్ అవార్డుల ఎంపికపై పెద్దగా విమర్శలు లేవు. కానీ ఏపీలో నంది అవార్డుల ఎంపిక ఎప్పుడూ వివాదాస్పదమే. తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన సినిమాలకే ఏపీ కూడా అవార్డులు ఇస్తే ‘కాపీ’ అంటారు.. వేరే సినిమాలకు ఇస్తే ‘ప్రాంతీయ వివక్ష’అంటారు.దీంతో ఈ తలనొప్పులు భరించడం కంటే, అసలు ఆ జోలికే వెళ్లకపోవడం మేలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
జగన్ మార్క్ ‘టైట్’ పాలసీ vs కూటమి ఉదారత
గతంలో జగన్ హయాంలో టికెట్ రేట్ల విషయంలో పరిశ్రమ ముప్పుతిప్పలు పడ్డప్పుడు సినిమా వాళ్లంతా అమరావతికి క్యూ కట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాఫ్ట్గా ఉండటంతో పరిశ్రమ దాన్ని అలుసుగా తీసుకుంటోందనే టాక్ ఉంది. ‘అవసరం ఉన్నప్పుడే ఆంధ్రా గుర్తొస్తుందా?’ అనే అసహనం అటు సామాన్య జనాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ బలంగా ఉంది. అందుకే నంది అవార్డుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రెండు రాష్ట్రాలు కలిసి ఇవ్వడం అసాధ్యమా?
ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అవార్డులు ఇస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు . కాని అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇస్తుంటే, ఏపీలో నంది పేరుతో ఇస్తున్నారు. ఈ రెండు విభిన్న ప్రతీకల మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల రెండు రాష్ట్రాలు కలవడం కష్టమే.టాలీవుడ్ ఇప్పటికైనా మేల్కొని ఏపీలో స్టూడియోలు కట్టడం, షూటింగులు చేయడం వంటివి చేసి ప్రభుత్వానికి దగ్గరవ్వాలి. లేదంటే, ఏపీలో నంది అవార్డులు ఇక చరిత్రగానే మిగిలిపోయే ప్రమాదం పుష్కలం.
also read: టాలీవుడ్ హీరోల ‘పార్ట్ టైమ్’ వేషాలు చూశారా?