Niharika Konidela: ఫిలింఫేర్ అవార్డ్స్ వివాదంపై నిర్మాతగా మారిన నిహారిక కొణిదెల మరోసారి స్పందించారు. సంగీత్ శోభన్ హీరోగా, నిహారిక నిర్మాతగా రూపొందిన రాకాసి సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన టీజర్ ఈవెంట్లో నిహారిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఈవెంట్లో యాంకర్ నిహారికను ఒక ప్రశ్న అడిగారు. “మీరు ఎక్కువగా డెబ్యూట్ డైరెక్టర్లతోనే సినిమాలు ఎందుకు చేస్తున్నారు?” అని అడగగా, నిహారిక సమాధానమిస్తూ… తన దగ్గరకు ఇప్పటికే సక్సెస్ అయిన పెద్ద డైరెక్టర్లు ఎవరూ కథలు చెప్పడానికి రాలేదని తెలిపారు. కొత్త దర్శకులే వచ్చి కథలు చెప్పారని, వాటిలో కంటెంట్ నచ్చిన కథలకు మాత్రమే తాను అవకాశం ఇచ్చానని చెప్పారు. డెబ్యూట్ అనే కారణంతో కాదు, ప్రతిభను చూసే నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది.
ఇక తన కమిటీ కుర్రాళ్ళు సినిమాకు ఫిలింఫేర్ అవార్డు వచ్చిన విషయంపై కూడా నిహారిక మాట్లాడారు. ఆ అవార్డు తనకు కాదని, తన సినిమా దర్శకుడికి, హీరోకు వచ్చిందని తెలిపారు. అవార్డు వేడుకకు తాను వెళ్లలేదని, కానీ తన సినిమా టీమ్కు అవార్డు రావడం చూసి చాలా ఆనందంగా ఫీలయ్యానని చెప్పారు.
ఈ మధ్య కాలంలో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ నిర్వహణపై పలువురు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అవార్డు అందుకున్నవారికి మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వలేదని నిహారిక కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి యాంకర్ అడగగానే, ఆమె మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నిహారిక మాట్లాడుతూ, అవార్డు వేడుకలో మలయాళం డెబ్యూట్ ఆర్టిస్టులకు మాట్లాడే అవకాశం ఇచ్చారని, కానీ తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమలకు చెందినవారికి ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ఇది తనను చాలా బాధపెట్టిందని చెప్పారు.
రాకాసి టీజర్ ఈవెంట్ నిహారిక వ్యాఖ్యలతో మరింత హాట్ టాపిక్గా మారింది. ఆమె మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాదు, అభిమానుల్లో కూడా చర్చకు దారి తీస్తున్నాయి.
ALSO READ: Allu Sirish wedding: పెళ్లి కొడుకైన అల్లు శిరీష్… వైరల్ అవుతున్న వీడియో !