NTR Incident: సినీ పరిశ్రమలో హీరోల మధ్య ఉండే స్నేహాల గురించి మనకు తెలుసు, కానీ ఒక హీరో కెరీర్ కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన స్నేహితుల గురించి వినడం అరుదు. తాజాగా స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు ఇప్పుడు టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ (తారక్), మాజీ మంత్రి కొడాలి నాని, దివంగత నేత పరిటాల రవి మధ్య జరిగిన ఒక పాత సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.
Read also-శర్వానంద్ సిల్వర్ స్క్రీన్కు పొర్లుదండం పెట్టడానకి రీజన్ ఇదే..
పరిటాల రవి తన తండ్రి అయిన పరిటాల శ్రీరాములయ్య జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించాలని బలంగా కోరుకున్నారు. అయితే ఆ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేయగలరని, ఆయన నటన ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని పరిటాల రవి భావించారు. ఈ సినిమాను రూపొందించే బాధ్యతలను చర్చించడానికి అప్పట్లో తారక్ కి అత్యంత ఆప్తుడిగా ఉన్న కొడాలి నానిని పరిటాల రవి సంప్రదించారు.
దర్శకుడు వీవీ వినాయక్ వివరాల ప్రకారం.. ఈ ప్రతిపాదనను కొడాలి నాని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తారక్ అప్పుడప్పుడే మాస్ హీరోగా ఎదుగుతున్నాడని, ఆ సమయంలో ఇలాంటి రాజకీయ, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న బయోపిక్ చేస్తే కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని నాని భావించారు. అయితే, పరిటాల రవి లాంటి పద్మవ్యూహం లాంటి నాయకుడిని ఎదిరించడం ఆ సమయంలో సామాన్యమైన విషయం కాదు. “ఈ సినిమా చేయకపోతే నిన్ను చంపేస్తాం” అని పరిటాల రవి వర్గం నుండి తీవ్రమైన హెచ్చరికలు, బెదిరింపులు వచ్చినప్పటికీ నాని వెనక్కి తగ్గలేదని వినాయక్ పేర్కొన్నారు. తన ప్రాణం పోయినా పర్లేదు కానీ, తారక్ కెరీర్ దెబ్బతినకూడదనే పట్టుదలతో నాని ఆ ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆయన వివరించారు.
Read also-అసలు స్టేండప్ కామెడీ అంటే ఏమిటి?.. ఆ కల్చర్ మనపై ప్రభావం ఎంత?
అంతే కాకుండా ఈ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ.. “నానిది చాలా మొండి ఘటం. తారక్ మీద ఆయనకున్న ప్రేమ, నమ్మకం అలాంటివి. ప్రాణ భయం ఉన్నా సరే, తారక్ భవిష్యత్తు కోసం అంతటి రిస్క్ తీసుకున్నారు” అని కొనియాడారు. చివరికి ఆ సినిమా మోహన్ బాబు ప్రధాన పాత్రలో, ఎన్. శంకర్ దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత వినాయక్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో తారక్ కోసం కొడాలి నాని చేసిన ఈ త్యాగం మరియు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.