Pawan Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒకవైపు కొనసాగుతూనే.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. చిన్న పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు ఎంతో మంది ఆరాధిస్తున్నారు. అభిమాని పిలిస్తే ఎక్కడికైనా వెళ్లే పవన్ కళ్యాణ్.. ఒక చిన్నారి కోరికను నెరవేర్చి అందరిని అబ్బురపరిచిన విషయం తెలిసిందే.. అలాంటి పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు కన్నుమూశారు. వరంగల్ జిల్లా హనుమకొండ హనుమాన్ నగర్ కి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ముఖ్యంగా వ్యాధి ముదరడంతో ఆరోగ్యం మరింత క్షీణించడంతోనే నిరంజన్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే నిరంజన్ పవన్ కళ్యాణ్ ను కలవాలనే కోరిక తీరినప్పటికీ మరో కోరిక తీరకుండానే మరణించడం అందరినీ కన్నీటి పర్యంతం చేస్తోంది. ఇక నిరంజన్ మృతితో హనుమకొండలోని హనుమాన్ నగర్ లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా హనుమకొండ హనుమాన్ నగర్ కి చెందిన నిరంజన్ ఏడేళ్ల వయసు వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. అనంతరం అతడికి డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (DMD) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడ్డాయి. సరిగ్గా నడవలేకపోవడం, కూర్చో లేకపోవడం, చేతులు కదపలేకపోయాడు.. ఈ వ్యాధి బారిన పడ్డ నిరంజన్ చివరికి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. పైగా ఇటీవల కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో నిరంజన్ ఆరోగ్యం మరింత విషమించింది. అయితే ఆరోగ్యం ఎంత క్షీణించినా నిరంజన్ మనోధైర్యంగా ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ పై ఉన్న అమితమైన అభిమానం.
పవన్ కళ్యాణ్ సినిమాలు, పాటలు , ప్రసంగాలు చూస్తూ స్ఫూర్తి పొందేవాడు నిరంజన్. ఇక శరీరం సహకరించకపోయినా మంచం పైనే పడుకొని పవన్ పాటలకు స్టెప్పులు వేయడానికి ప్రయత్నించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ ను కలవాలని నిరంజన్ కోరికను ఆయన కుటుంబ సభ్యులు జనసేన దృష్టికి తీసుకెళ్లగా.. అతని వీడియోలు వైరల్ చేసి చివరికి నిరంజన్ కోరికను పవన్ కళ్యాణ్ దృష్టికి చేర్చారు. పవన్ కళ్యాణ్ నిరంజన్ ను గత నెల జూన్ 17వ తేదీన స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక నిరంజన్ సోదరి చదువుకు అయ్యే పూర్తి ఖర్చును భరిస్తారని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, తల్లి కోసం ఒక దుకాణం కూడా పెట్టిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తిరుమల శ్రీవారి ప్రసాదంతో పాటు జనసేన డైరీపై తన చేతిరాతతో ప్రత్యేక సందేశం రాసి బహుమతిగా అందించారు పవన్ కళ్యాణ్. ఇక తక్షణమే ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.
ఇక పవన్ కళ్యాణ్ కలిసిన నిరంజన్ తనకు చిన్నచిన్న కోరికలు ఉన్నాయని పంచుకున్నారు. నాకు ఒక కుక్క పిల్లను పెంచుకోవాలని ఉంది అని చెప్పగానే .. అదే రోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ఒక చిన్న కుక్క పిల్లను నిరంజన్ ఇంటికి పంపించి అతని కోరికను నెరవేర్చారు. ఇక ఆ కోరికతో పాటు మరో కోరిక కూడా కోరారు నిరంజన్. ఓజి 2 సినిమా చూడాలని.. దాంతో పవన్ కళ్యాణ్ “ఓజీ 2 విడుదలైతే నువ్వే నా స్పెషల్ గెస్ట్.. మనిద్దరం కలిసి సినిమా థియేటర్లో చూద్దామని” చెప్పారు. అయితే ఆ కోరిక తీరకుండానే నిరంజన్ తీరని లోకాలకు వెళ్లిపోయారు. ఇక ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత..#PawanKalyan #RIPNiranjan #OG2 #BIGTVCinema @PawanKalyan pic.twitter.com/XpH1NBqVVY
— BIG TV Cinema (@BigtvCinema) July 8, 2026