Prabhu Deva:ప్రఖ్యాత నటుడు, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేసిన ఒక డీల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడం అంటే ఖచ్చితంగా మంచి లాభం వస్తుందని భావిస్తారు. కానీ ప్రభుదేవా అనుభవం చూస్తే ఆ అభిప్రాయం ఎప్పుడూ సరైనది కాదని అర్థమవుతోంది.
2012 సంవత్సరంలో ప్రభుదేవా ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో రెండు ఫ్లాట్లు కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ రెండు ఫ్లాట్ల కోసం ఆయన సుమారు రూ.14.45 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇవి ఒక హై రైజ్ బిల్డింగ్లో ఉన్న ఫ్లాట్లు. ఒకటి 32వ అంతస్తులో, మరొకటి 33వ అంతస్తులో ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ సుమారు 1,295 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది.
సుమారు 14 సంవత్సరాల తర్వాత, అంటే 2026లో, ఈ ఫ్లాట్లను ఆయన అమ్మేశారు. అమ్మిన మొత్తం విలువ రూ.14.80 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే మొత్తం లాభం కేవలం రూ.35 లక్షలు మాత్రమే. ఇంత కాలం తర్వాత వచ్చిన ఈ లాభం చాలా తక్కువగా చెప్పాలి.
మరి అంత తక్కువ..!
శాతం పరంగా చూస్తే ఈ పెరుగుదల కేవలం 2.4% మాత్రమే. ఇది ద్రవ్యోల్బణం కంటే కూడా తక్కువగా ఉండటం గమనార్హం. అంటే ఈ పెట్టుబడి ద్వారా పెద్దగా లాభం రాలేదని చెప్పవచ్చు.
ఇక మరోవైపు, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ప్రాపర్టీ ధరలు గత కొన్ని సంవత్సరాల్లో బాగా పెరిగాయి. కొన్ని అంచనాల ప్రకారం 2019 తర్వాత ఈ నగరాల్లో ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయినప్పటికీ, ప్రతి ప్రాపర్టీకి ఒకే రకం లాభం ఉండదు.
2025లో దేశవ్యాప్తంగా ప్రాపర్టీ ధరలు కొంతమేర పెరిగినా, హౌసింగ్ సేల్స్ మాత్రం స్వల్పంగా తగ్గాయి. అంటే డిమాండ్.. ధరల మధ్య అసమతౌల్యం కనిపించింది.
ఇక ఇది చూసి ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఇది చూడడం వల్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడి గురించి ఒక అవగాహన తెచ్చుకోవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. భూమిపైన డబ్బులు పెట్టేసినంత మాత్రాన మనకు లాభం వస్తుంది అని అనుకోవడం మూర్ఖత్వం అని.. ఏదైనా మార్కెట్ పరిస్థితులు, ప్రదేశం, డిమాండ్ వంటి అంశాలను బట్టి మారుతూనే ఉంటుందని.. కాబట్టి భూమి పైన పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.