Rashmika:నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. విజయాలు అందుకొనేవారిపైనే ట్రోల్స్ వస్తూ ఉంటాయి. రష్మిక మీద కూడా నెగిటివిటీ చాలా గట్టిగానే జరుగుతుంది. ఆ నెగిటివిటి కూడాతనపై కొంతమంది కావాలనే చేయిస్తున్నారని రష్మిక చెప్పడం సంచలనంగా మారింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తనపై వస్తున్న నెగిటివిటి గురించి చెప్పుకొచ్చింది. తాను పైకి కనిపించేంత ధైర్యస్తురాలిని కాదని, చాలా ఎమోషనల్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అన్ని ఎమోషన్స్ బయటపెట్టడానికి అస్సలు ఇష్టపడను అని చెప్పుకొచ్చింది. ‘నేను చాలా ఎమోషనల్.. ఆ విషయం నాకు తెలుసు. అలాగే నేను రియల్ పర్సన్. నేను అన్ని ఎమోషన్స్ బయట చెప్పుకోవాలని అనుకోను. ఎవరి ముందు చూపించడానికి ఇష్టపడను. ఎందుకంటే నా దయా గుణాన్ని అందరూ నిజం కాదు అనుకుంటారు. కెమెరాల ముందు నటిస్తున్నాను అని, అది నా బలహీనత అని బ్రహ్మ పడుతుంటారు.
కానీ, మనం జీవితంలో ఎంత నిజాయితీగా ఉంటామో.. అది అంత వ్యతిరేకతను తీసుకొచ్చిపెడుతుంది. నాకు దయాగుణం ఎక్కువ. అది పర్సనల్ ఛాయిస్. దానివలన ఎలాంటి ఉపయోగం లేదు. అయినా కూడా నేను ఎప్పుడు దయతోనే ఉంటాను. ఇండస్ట్రీలో నేను చాలా నెగిటివిటిని, ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నాను. డబ్బులిచ్చి నాపై నెగిటివిటి చేయిస్తున్నారు. మీరు ఎదగడం కోసం ఎదుటివారి గొంతు నొక్కద్దు. వారిని కూడా ఊపిరి పీల్చుకోనిద్దాం. అందరిని ఎదగనిద్దాం” అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రష్మికను అంతగా నెగిటివ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. ? ఎవరు డబ్బులిచ్చి ట్రోల్ చేయిస్తున్నారు ..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తనను నెగిటివ్ చేస్తున్న వారెవరో రష్మికకు తెలుసా.. ? అందుకే ఎదగనిద్దాం అని చెప్పిందా.. ? అని చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీలో పైకి ఎదుగుతున్నవారిని చూసి కిందకు లాగేవారు చాలామంది ఉన్నారు. టాలెంట్ ఉంటే ఎవరూ ఎవరిని ఆపలేరు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రష్మిక ఇండస్ట్రీలో ఇంకా ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.