Mrithyunjay: శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల శ్రీ విష్ణు సినిమాలన్నీ కూడా కామెడీ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే .అయితే ఈసారి మాత్రం ఈయన మృత్యుంజయ్ (Mrithyunjay) అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు జోడిగా మరోసారి సామజ వరగమన ఫేమ్ హీరోయిన్ రెబా మోనికా జాన్ జంటగా కనిపించబోతున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 27వ తేదీ విడుదల చేయబోతున్నట్టు ఇదివరకు చిత్ర బృందం ప్రకటించారు. ఇలా ఫిబ్రవరి 27వ తేదీ మృత్యుంజయ్ 28వ తేదీ విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)సినిమాలు ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఇలా ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం అంటే కచ్చితంగా సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపుతుందని ఈ సినిమా విడుదల విషయంలో చిత్ర నిర్మాతలు సాహసం చేస్తున్నారంటూ ఎంతో మంది వారి అభిప్రాయాలను తెలియజేశారు.
ఇలా ఈ రెండు సినిమాల ఒకేసారి విడుదల కాబోతున్నాయని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ చివరికి మృత్యుంజయ్ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈ విషయంపై శ్రీ విష్ణు కూడా స్పందిస్తూ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం లేదని తాను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను అంటూ తెలియచేశారు ఇక తాజాగా మృత్యుంజయ్ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ అధికారక పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాని మార్చి 6వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియచేశారు. విష్ణు విన్యాసం ఫిబ్రవరి 28వ తేదీ విడుదల కాగా మృత్యుంజయ మార్చి6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే శ్రీ విష్ణు రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
రాజమౌళి చేతుల మీదుగా టీజర్ లాంచ్..
ఇక మార్చి ఆరో తేదీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మ్యాన్షన్ హౌస్ మల్లేష్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, శివాజీ లయ జంటగా నటించిన సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అనే సినిమాలు కూడా మార్చి ఆరో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాలన్నింటికీ పోటీగా శ్రీ విష్ణు మృత్యుంజయ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మృత్యుంజయ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది రాజమౌళి చేతుల మీదుగా ఈ టీజర్ కి విడుదల చేసిన సంగతి తెలిసిందే.