Srikanth Addala: తెలుగు సినిమా ఇండస్ట్రీలో భావోద్వేగాలతో కూడిన కథలను అందంగా తెరకెక్కించే దర్శకుడిగా శ్రీకాంత్ అద్దాలకి మంచి పేరు ఉంది. ఆయన దర్శకత్వం వహించిన కొత్త బంగారులోకం సినిమాతోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కాలేజ్ లవ్ స్టోరీని సహజంగా, మనసుకు హత్తుకునేలా చూపించిన ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం తర్వాత శ్రీకాంత్ అద్దాల పేరు మరింతగా వినిపించింది.
ఆ తరువాత ఆయనకు స్టార్ హీరోలతో పని చేసే అవకాశం వచ్చింది. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి ఇద్దరు టాప్ హీరోలను ఒకే సినిమాలో చూపిస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని తెరకెక్కించారు. కుటుంబ విలువలు..అన్నదమ్ముల అనుబంధం, గ్రామీణ వాతావరణం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి సూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
అయితే..ఈ విజయం తర్వాత శ్రీకాంత్ అద్దాలకు ఆశించిన స్థాయిలో సక్సెస్ కొనసాగలేదు. మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన పెద్ద కాపు సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై, చివరికి డిజాస్టర్గా మిగిలింది. ఈ ఫలితంతో దర్శకుడిపై కొంత ఒత్తిడి పెరిగిందని ఇండస్ట్రీలో చర్చ జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీకాంత్ అద్దాల మరో కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి పూర్తిగా కొత్తగా, భిన్నమైన ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఈ కథ కోనసీమ నేపథ్యంగా ఉండబోతుందట. ముఖ్యంగా అక్కడి ఆధ్యాత్మికత, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రబల తీర్థం పండుగ నుంచి ప్రేరణ తీసుకున్న కథగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.
కోనసీమ ప్రాంతం అంటేనే పచ్చని పొలాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలు గుర్తుకు వస్తాయి. అలాంటి వాతావరణంలో సాగే కథ అయితే, శ్రీకాంత్ అద్దాల స్టైల్కు చాలా సూటవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. నిజంగా ఈ ప్రాజెక్ట్ కనుక కార్యరూపం దాలిస్తే, ఇది ఇటీవల కాలంలో వచ్చిన అత్యంత సహజమైన, సంస్కృతికి దగ్గరైన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలవవచ్చని బలమైన బజ్ నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ కొత్త ప్రయత్నంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: The Raja Saab: నార్త్ అమెరికాలో ది రాజా సాబ్ పరిస్థితి మరీ దారుణం.. ఎంత కలెక్ట్ చేసిందంటే..!