Suchitra Sen: సుచిత్రా సేన్.. ఈ పేరు ఇప్పటి ఆడియన్స్ పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఆమె క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా కాదు .ఒక రకంగా చెప్పాలంటే హిందీ సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన మీనా కుమారి, తెలుగు సినిమాని మరో మెట్టెక్కించిన సావిత్రి కి ఈమె ఇన్స్పిరేషన్. అలా బాలీవుడ్ టాలీవుడ్ దిగజాలని సైతం ప్రభావితం చేసిన ఈ అలనాటి తార బెంగాల్ ప్రజలకి అయితే తే ఒక ఆరాధ్య దైవం అని చెప్పాలి.తెలుగు ప్రేక్షకులకు అక్కినేని, సావిత్రి కాంబినేషన్ అంటే ఎంత క్రేజో బెంగాలీ సీనీ ఆడియన్స్ కి ఉత్తమ్ కుమార్ – సుచిత్రా సేన్ అంటే అంత క్రేజ్ .ఇక సిల్వర్ స్క్రీన్ పై వీరి కాంబినేషన్లో ఏకంగా 30 సినిమాలు వచ్చి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి .
హిస్టరీలో ది బెస్ట్ క్లాసిక్స్ అనే సినిమాలన్నీ ఆమె ఖాతాలోనే
తన సుదీర్ఘ సినీ జీవితంలో సుచిత్ర నటించినవి కేవలం 60 సినిమాల్లోని అయినప్పటికీ బెంగాలీ సినిమా హిస్టరీలో ది బెస్ట్ క్లాసిక్స్ అనే సినిమాలన్నీ ఆమె ఖాతాలోనే ఉండడం విశేషం .1931 ఏప్రిల్ 6న నాటి పబ్నా (ప్రస్తుత బంగ్లాదేశ్) ప్రాంతంలో రోమాదాస్ గుప్తా గా జన్మించింది.ఇక ఈమె తండ్రి కరుణామయిదాస్ గుప్తా ఒక హెడ్మాస్టర్.ప్రముఖ కవి రజినీకాంత్ మనమరాలైన సుచిత్రా సేన్ 1947లో దిబానాథ్ సేన్ను పెళ్లి చేసుకున్నాక భర్త, మామతో సహాయంతోనే ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.1952లో ‘శేష్ కొథాయ్’ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది.అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమా రిలీజ్ కాలేక పోయింది.కానీ ఆ మరుసటి సంవత్సరం1953లో నిర్మల్ డే తెరకెక్కించిన ‘షరే చౌతూర్’ సినిమాతో ఉత్తమ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.
ఇక ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై ఒక అద్భుతమైన రొమాంటిక్ జోడి కి నాంది పలికిందని చెప్పాలి .ఇక ఆ తర్వాత 1955లో లెజెండరీ డైరెక్టర్ బిమల్ రాయ్ తెరకెక్కించిన బాలీవుడ్ క్లాసిక్ ‘దేవదాస్’లో పార్వతి (పారు) పాత్ర సుచిత్రా సేన్ను వెతుక్కుంటూ వచ్చింది . ఈ పాత్ర సుచిత్ర తప్ప మరెవరు పండించలేరని బలంగా నమ్మాడట బిమల్.ఇక ఆ నమ్మకాన్ని 100కు 100% నిజం చేస్తూ పారు పాత్రకు ప్రాణం పోసింది సుచిత్రా సేన్.
బాలీవుడ్ సినిమాల వైపు నో ఫోకస్
ఆ సినిమాలో దేవదాసుగా దిలీప్ కుమార్, చంద్రముఖిగా వైజయంతి మాల వంటి దిగజాలు గట్టి కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ సుచిత్ర నటన ముందు వాళ్లంతా తేలిపోయారు అనేది అప్పట్లో వినిపించిన టాక్ ఇక ఆ సినిమాతోనే నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చినా ఆమె బాలీవుడ్ సినిమాల వైపు ఫోకస్ పెట్టకపోవడం గమనార్హం.ఇక కేవలం కొందరు బెంగాలీ దర్శకుల హిందీ సినిమాలు తీస్తే వారు నటించాలని పట్టుబడితే కొన్ని సినిమాలకు ఓకే చెప్పింది సుచిత్రా సేన్.అలా 1957లో హృషికేష్ ముఖర్జీ తీసిన తీసిన ఎక్స్పెరిమెంటల్ ఫిలిం ‘ముసాఫిర్’లో ఓ చిన్న పాత్రలో మెరిసింది.ఇక అదే ఏడాది ఏడాది ఫిల్మిస్తాన్ బ్యానర్లో ఎస్.ముఖర్జీ నిర్మించిన ‘చంపాకలీ’లో భరత్ భూషణ్ కి జోడిగా నటించింది సుచిత్రా సేన్ .అలాగే శంకర్ ముఖర్జీ సినిమా సర్హాద్ లో దేవానంద్ కి జోడిగా నటించిన సుచిత్రా సేన్ ఆ తర్వాత 1960లో రాజ్ ఖోస్లా దర్శకత్వంలో వచ్చిన ‘బొంబాయి కా బాబు’ చిత్రంలో మళ్లీ దేవానంద్తో కలిసి నటించింది .
ఇక 1963 లో బెంగాలీలో బ్లాక్ బస్టర్ అయిన ‘ఉత్తర ఫల్గుణి’ సినిమాను 1966 లో దర్శకుడు హిందీలో రీమేక్ చేయగా అందులో సుచిత్ర తల్లి ,కూతురిగా డబుల్ రోల్ లో నటించి మెప్పించింది . ఆ సినిమా మ్యూజికల్ బ్లాక్బస్టర్ అయినప్పటికీ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేయలేదు సుచిత్ర.ఏకంగా సత్యజిత్ రే వంటి ఆస్కార్ స్థాయి దర్శకుడి సినిమాను ,రాజ్ కపూర్ ఇచ్చిన భారీ ఆఫర్లను కూడా సుచిత్ర తిరస్కరించారంటే ఆమె ప్రొఫెషనలిజం ఏ స్థాయివో అర్థం చేసుకోవచ్చు.
పూర్తిగా ఇందిరాగాంధీలా ఉండటంతో
ఇక మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్స్ అవార్డు (సాత్ పాకే బంధా – 1963 చిత్రానికి) అందుకున్న తొలి భారతీయ నటి ఆమే కావడం ఇక్కడ విశేషం.ఇక ఆమె బాలీవుడ్ జర్నీలో మైల్ స్టోన్ గా నిలిచిన సినిమా1975 నాటి ‘ఆంధీ’. గుల్జార్ దర్శకత్వంలో, ప్రముఖ రచయిత కమలేశ్వర్ రాసిన ‘కాలీ ఆంధీ’ నవల ఆధారంగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ . ఇది ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ ప్రచారం జరిగింది. కమలేశ్వర్ మాత్రం తాను జన్సంఘ్ నాయకురాలు మహారాణి గాయత్రీ దేవి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పినా జనం నమ్మలేదు. నిజానికి కథకు ఇందిర వ్యక్తిగత జీవితానికి సంబంధం లేకపోయినా, సుచిత్రా సేన్ హెయిర్ స్టైల్, శారీ కట్టుకునే విధానం, ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా ఇందిరాగాంధీలా ఉండటంతో వివాదం రాజుకుంది.
ఇక మన తెలుగు చిత్రసీమతోనూ సుచిత్రా సేన్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఎఎన్ఆర్ నటించిన ‘ఆరాధన’ (బెంగాలీలో సాగరికా), ‘మాంగల్యబలం’ (బెంగాలీలో అగ్నిపరీక్షా), ‘వివాహబంధం’ (బెంగాలీలో చావా పావా).. ఇలా ఎన్నో సూపర్ హిట్ తెలుగు సినిమాలకు మూలం సుచిత్ర నటించిన బెంగాలీ చిత్రాలే. ముఖ్యంగా సావిత్రి నటనకు మచ్చుతునకగా, కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచిన ‘చివరకు మిగిలేది’ సినిమా.. సుచిత్రా సేన్ మానసిక రోగుల నర్స్గా నటించి మెప్పించిన ‘దీప్ జలీ జాయ్’ (1959) చిత్రానికి అధికారిక రీమేక్. తెలుగులో ఈ ప్రయోగం అంతగా ఆడకపోయినా, బెంగాలీలో ఇండస్ట్రీ హిట్. ఇదే సినిమాను హిందీలో ‘ఖామోషి’గా వహీదా రెహమాన్తో రీమేక్ చేశారు.
దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు తిరస్కరణ
ఇలా వెండితెరపై దశాబ్దాల పాటు ఏలిన సుచిత్రా సేన్, 1978లో ‘ప్రణయ్ పాషా’ సినిమా ప్లాప్ అయ్యాక హఠాత్తుగా చిత్ర పరిశ్రమ నుంచి పూర్తిగా మాయం అయింది .సినిమాలకి శాశ్వతంగా గుడ్బై చెప్పేసి, రామకృష్ణ మిషన్ ఆశ్రయంతో ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళింది. కృష్ణ భక్తురాలిగా మారిపోయి ఏకాంత జీవితాన్ని గడిపింది. చనిపోయే వరకు ఆమె ముఖాన్ని మీడియా కానీ, అభిమానులు కానీ చూడలేకపోయారు.
సినీ ప్రపంచం ఇచ్చే అత్యున్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు (2005లో) ఆమెకి వచ్చినా ఢిల్లీకి వచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలనే రూల్ ఉండటంతో, ఆ అవార్డు కంటే తన ఏకాంతమే ముఖ్యమని భావించి దాన్ని సున్నితంగా తిరస్కరించడం విశేషం.
సుచిత్ర సేన్ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా
కేవలం 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున మమతా బెనర్జీ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ‘బంగబిభూషణ్’ అవార్డును ఇస్తేనే స్వీకరించారు. సుమారు మూడు దశాబ్దాల పాటు ఎవరికీ కనిపించకుండా ఒక ‘మిస్టరీ క్వీన్’లా జీవించిన ఈ మహానటి, 2014 జనవరి 17న కోల్కతాలో గుండెపోటుతో తన 82వ ఏట కన్ను మూసింది. శారీరకంగా ఆమె మన మధ్య లేకపోయినా తన సినిమాల ద్వారా ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో సుచిత్ర సేన్ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది .