The Kerala story:కేంద్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 1న 71వ జాతీయ అవార్డుల జాబితాను ప్రకటించింది. ఉత్తమ సినిమాగా తెలుగులో ‘భగవంత్ కేసరి’ మూవీకి జాతీయ అవార్డు లభించగా.. ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) ఎంపికయ్యారు.
2 విభాగాలలో నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ది కేరళ స్టోరీ..
అయితే ఇదే సమయంలో అదా శర్మ (Adah Sharma) నటించిన ‘ ది కేరళ స్టోరీ’ సినిమాకి రెండు విభాగాలలో జాతీయ అవార్డులు లభించాయి. ఒకటి ఉత్తమ దర్శకుడు, మరొకటి సినిమాటోగ్రఫీ. అయితే ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడంతో.. కేంద్రంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంపై మండిపడ్డ కేరళ సీఎం..
ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. “మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా.. తీసిన ఒక సినిమాకి ఇలాంటి గౌరవాన్ని కల్పించడం నిజంగా దారుణం.. సంఘ్ పరివార్ విభజనాత్మక సిద్ధాంతాలను పరోక్షంగా అవార్డు జ్యూరీ కమిటీ సమర్ధించినట్లే అనిపిస్తోంది. మత సామరస్యానికి చిరునామా అయిన కేరళ ను అవమానించినట్లే అవుతుంది. ఇది కేవలం ఒక మలయాళీలను మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరిని బాధించే అంశంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రతి ఒక్కరు కూడా తమ గొంతు విప్పాలి” అంటూ కేరళ సీఎం కోరారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. కేంద్రం తీరుపై కేరళ ముఖ్యమంత్రి మండిపడుతూ చేసిన ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ది కేరళ స్టోరీ కథ ఏంటి?
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే షాలిని (ఆదాశర్మ), నీమా, గీతాంజలి అనే ముగ్గురు స్నేహితురాళ్లు కేరళ కాసర్గడ్ లోని నర్సింగ్ కాలేజీలో విద్యార్థులుగా ఉంటారు. వీరు ఉండే హాస్టల్ గదిలోనే ఆసిఫా అనే మరో యువతి కూడా ఉంటుంది. ఐసిస్ లో అండర్ కవర్ అయిన ఆసిఫా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి, మతం మార్చే మిషన్ లో పనిచేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇద్దరు అబ్బాయిలను రంగంలోకి దింపి.. గీతాంజలి, షాలినీలను ప్రేమించేలా పథకం రచిస్తుంది. ఇక రమీజ్ ప్రేమలో పడిన షాలిని అనుకోకుండా అతడితో కలిసి, గర్భవతి కూడా అవుతుంది. పెళ్లి చేసుకోమని అడిగితే మతం మార్చుకుంటేనే వివాహం చేసుకుంటానని హెచ్చరిస్తాడు. దీంతో చేసేదేమీ లేక మతం మార్చుకొని రమీజ్ ని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత కొద్ది రోజులకు అతడు ముఖం చాటేయడంతో ఇసాక్ అనే మరో యువకుడితో కలిసి భారత్ నుంచి సిరియాకు వెళుతుంది షాలిని. అక్కడికి వెళ్లాక మోసపోయానని తెలుసుకున్న ఆమె ఏం చేసింది ? అక్కడ ఆమెకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఆసిఫా మాటలు విన్న నీమా, గీతాంజలి ఏమయ్యారు ? అనే విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
నిజ జీవిత ఘటన ఆధారంగా ది కేరళ స్టోరీ..
గతంలో యువతులే లక్ష్యంగా మతమార్పిడిన ప్రోత్సహించి ఐసిస్ వంటి ఉగ్ర సంస్థల్లోకి పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది రాజకీయంగా తీవ్రదుమారం కూడా రేపింది. దానినే ఆధారంగా తీసుకొని ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నిజ జీవితానికి అద్దం పడుతూ ఎవరిని నమ్మాలి? ఎలా ఉండాలి? అనే అంశాలను చూపిస్తూ అందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చిందని నటిజన్స్ కూడా కామెంట్లు చేశారు.
ALSO READ:Nagarjuna: అభిమానుల కోసం దిగివస్తున్న నాగార్జున.. ఆగస్టు 8న ఏం చేయబోతున్నారంటే?