Revenue Sharing: తెలుగు సినీ పరిశ్రమలో పంపిణీదారులు మరియు థియేటర్ యజమానుల మధ్య ఆదాయం పంచుకునే పద్ధతిపై పెద్ద చర్చ మొదలైంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఇటీవల తీసుకొచ్చిన ‘పర్సంటేజ్ ఆధారిత స్క్రీనింగ్ మోడల్’ను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు గిల్డ్ సభ్యులు ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు ఒక బహిరంగ లేఖ రాశారు.
Read also-‘ధురంధర్ 2’లో ‘ఓయే ఓయే’ పాటపై వివాదం.. ఏంటి బాసూ అలా చేశారు..
సాధారణంగా సినిమా వసూళ్లలో థియేటర్ల వాటా, నిర్మాతల వాటాపై ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు ఉంటాయి. అయితే, TFCC మార్చి 25, ఏప్రిల్ 2న విడుదల చేసిన సర్క్యులర్ల ప్రకారం.. ఇకపై ‘పర్సంటేజ్’ పద్ధతిలోనే థియేటర్ల కేటాయింపు జరగాలని ఏకపక్షంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం తమకు నష్టం కలిగిస్తుందని నిర్మాతలు వాదిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో అమలులో ఉన్న పాత పద్ధతిని మార్చవద్దని, దానినే కొనసాగించాలని నిర్మాతలు కోరుతున్నారు. ప్రొడ్యూసర్లతో సరైన సంప్రదింపులు జరపకుండా ఛాంబర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఛాంబర్ నిర్ణయించిన ఈ కొత్త మోడల్ను అనుసరించే థియేటర్లలో తమ సినిమాలను ప్రదర్శించే ప్రసక్తే లేదని నిర్మాతలు తెగేసి చెప్పారు.
ఈ నిరసనలో టాలీవుడ్లోని దాదాపు అందరు అగ్ర నిర్మాతలు భాగస్వాములయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ (రవిశంకర్), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (విశ్వప్రసాద్), సితార ఎంటర్టైన్మెంట్స్ (నాగవంశీ), అన్నపూర్ణ స్టూడియోస్ (సుప్రియ), గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థలు (బన్నీ వాసు, SKN) వంటి ప్రముఖులు ఈ లేఖపై సంతకాలు చేశారు. వీటితో పాటు వాల్ పోస్టర్ సినిమా, షైన్ స్క్రీన్స్, SLV సినిమాస్ వంటి సంస్థలు కూడా పాత పద్ధతికే మద్దతు పలికాయి. పెద్ద సినిమాల విడుదలలు వరుసగా ఉన్న తరుణంలో, నిర్మాతలు మరియు ఛాంబర్ మధ్య నెలకొన్న ఈ విభేదాలు పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదం చర్చలతో సమసిపోతుందా లేదా థియేటర్ల వద్ద ప్రతిష్టంభనకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.