Actress : దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత సినిమా ఇండస్ట్రీలో చక్కగా సరిపోతుంది. మంచి ఫేమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటే, ఆ తర్వాత దీనస్థితికి దిగజారే దిక్కుమాలిన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. అయితే కొంతమంది నటీనటులకు ఎంత ఫేమ్ వచ్చినా సరే రెమ్యూనరేషన్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి నటీమణులు పాపులారిటీ తగ్గిన తర్వాత దారుణమైన పరిస్థితిలో జీవిస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి అత్యంత దీనమైన స్థితిలో ఉన్న నటులను ఎంతోమందిని చూసాము. తాజాగా మరో నటి ఓ వృద్ధాశ్రమంలో చేరడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో సినిమా పెద్దలు ఆమెకు సహాయం చేయలేదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంతకీ వృద్ధాశ్రమంలో చేరిన ఆ నటి ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…
పాకీజా అనే పేరు 90 కిడ్స్ బాగా తెలుసు. గతంలో తెలుగు సినిమాల్లో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన ఈవిడ ఒరిజినల్ పేరు వాసుకి. అయితే ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలోని పాకీజా క్యారెక్టర్ తో బాగా ఫేమస్ కావడంతో సొంత పేరు కంటే ఆ క్యారెక్టర్ పేరుతోనే ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. ఇక ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించిన ఈవిడ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నట్టు సమాచారం. చెరదీసి చూసే వాళ్ళు లేక తాజాగా ఆవిడ ఒక వృద్ధాశ్రమంలో చేరడం సంచలనంగా మారింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని ఒక వృద్ధాశ్రమంలో వాసుకి చేరారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించిన తాను… ఇండస్ట్రీకి దూరమైన తర్వాత పూట గడవని స్థితిని చేరుకున్నాను అని చెప్పిన వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోని చూసి ఆమె దుర్భర జీవితం గురించి తెలుసుకున్న శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించినట్టు తెలుస్తోంది.
వాసుకికి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సహాయం అందినట్టు తెలుస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు ఆవిడ. మంచు విష్ణు తన పరిస్థితిని తెలుసుకొని, కళ్ళకు ఆపరేషన్ చేయించడానికి సాయం అందించారని అన్నారు వాసుకి. అంతేకాదు మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు కలిసి రూ, 400000 ఆర్థిక సాయం అందించారని వాసుకి అలియాస్ పాకీజా వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా తనకు సహాయం చేసినట్టు ఆమె తెలిపారు.
1991లో ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది వాసుకి. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ గారి పెళ్ళాం, మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం వంటి సినిమాలలో కనిపించారు. ఇక ఇటీవలే నటి పావలా శ్యామలా ఇలాంటి దీనస్థితి కారణంగా ఆత్మహత్య చేసుకోబోగా, ఆమెను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటీ వృద్ధాశ్రమంలో చేరడంపై తెలుగు ఆడియన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : అనుకున్న దానికంటే ముందుగానే ‘దేఖ్ లేంగే’ సాంగ్ రిలీజ్… కానీ క్రేజీ ట్విస్ట్