Panchayat Elections: తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు ధీమాతో భారీగా ఖర్చు పెట్టారు. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు డబ్బులు కూడా ఇచ్చారు. ఈ నెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అదే రోజు ఫలితాలు తెలిసిపోయాయి. గెలిచిన వాళ్లు ఆనందంలో ఉండగా.. ఓడిన అభ్యర్థులు విషాదంలో మునిగిపోయారు.
మొదటి విడత ఎన్నికల్లో ఓటమి పాలన పలువురు అభ్యర్థులు ఓటర్లకు పంచిన డబ్బులను తిరిగి వసూలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు.. బీఆర్ఎస్ మద్దతు ఎన్నికల్లో పోటీ చేశారు. గెలుపు ధీమాతో ఓటర్లకు డబ్బులు పంచారు. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జక్కల పరమేశ్ 450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో బాలరాజు దేవుడి ఫొటో పట్టుకొని ఓటర్ల ఇంటికి వెళ్తున్నారు.
“మీరు నాకు ఓటు వేస్తే దేవుడి మీద ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి” అంటూ గ్రామంలో ఇంటింటికీ తిరిగారు. దీంతో చాలా మంది డబ్బులు తిరిగి తిచ్చేశారు. బాలరాజు భార్య మాట్లాడుతూ.. 50 లేదా 60 ఓట్ల తేడాతో ఓడిపోతే డబ్బులు అడగకపోయేవాళ్లమని చెప్పారు. 450 ఓట్లతో ఓడిపోయినందుకు తిరిగి ఇవ్వమని అడుగుతున్నామన్నారు.
Also Read: Hyderabad News: హైదరాబాద్లో రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
అందరూ తనకే ఓట్లు వేస్తే ఎలా ఓడిపోతానని బాలరాజు ఓటర్లను నిలదీస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎన్నికల కోసం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేశానని బాధితుడు విలపించారు. పలు గ్రామాల్లో కూడా ఓడిపోయిన అభ్యర్థులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతామంటూ ఓడిపోయిన అభ్యర్థులు బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.