హైదరాబాద్లోని ప్రముఖ చారిత్రాత్మక హోటల్ ఫలక్నుమా ప్యాలెస్ కు ఓ ప్రత్యేకత ఉంది. సాకర్ దిగ్గజం, అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఈ హోటల్లోనే బస చేయనున్నారు. దీంతో ఫలక్నుమా ప్యాలెస్ ప్రాముఖ్యత ఏంటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఫలక్నుమా అంటే ‘ఆకాశ దర్పణం’ అని అర్థం. దీన్ని ‘పైగా’ వంశానికి చెందిన హైదరాబాద్ ప్రధాని సర్ వికారుల్ ఉమ్రా ఇక్బాల్ దౌలా బహదూర్ ఒక ఎత్తైన గుట్టపై నిర్మించారు. 300 ఎకరాల్లో ఉన్న ఫలక్నుమా ప్యాలెస్లో 60 విలాసవంతమైన గదులు, 22 విశాలమైన హాళ్లు ఉన్నాయి. ఇందులో మూడు రాజ దర్భార్లతో సమానమైన గదులు ఉన్నాయి. ఇందులోనే మెస్సీకి విడిది ఏర్పాటు చేశారు. ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్కు ఇసుక, సున్నం, నీటితో కలిపిన డెకరేషన్.. అచ్చం బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. రిసెప్షన్లో మెస్సీ సైన్ చేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ ప్యాలెస్లో డైనింగ్కు ఒక ప్రత్యేకత ఉంది. 108 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తున్న డైనింగ్ టేబుల్ను బంగారం, క్రిస్టల్తో తయారు చేశారు. డైనింగ్ టేబుల్పై ఒకేసారి 100 మంది అతిథులు కూర్చుని భోజనం చేసే అవకాశం ఉంది. ఇక్కడే మెస్సీకి స్నాక్స్ సర్వ్ చేయనున్నారు.
ప్యాలెస్లో ఒక అద్దం.. ప్రపంచంలోనే అరుదైనది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ 35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్యాలెస్లో అరుదైన వస్తువులను మెస్సీకి చూపించే సమయంలో ఈ మిర్రర్ను ఖచ్చితంగా చూపించనున్నారు.