Tollywood Sequels: ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ హద్దులు దాటుతోంది. సినిమా హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో తెలియకముందే దర్శకులు, నిర్మాతలు పార్ట్ 2 అంటూ ప్రకటించడం ఇప్పుడు సాధారణమైపోయింది. కొన్ని సినిమాలు అయితే కథను మధ్యలోనే ఆపేసి, చివర్లో “పార్ట్ 2లో కొనసాగుతుంది” అనే కార్డుతో ముగిస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా టాలీవుడ్లో ఈ సీక్వెల్ కల్చర్ వేగంగా పెరిగింది. టాప్ హీరోల సినిమాలే కాదు, చిన్న హీరోల సినిమాలకూ పార్ట్ 2 ట్యాగ్ పెట్టేస్తున్నారు. కల్కి 2, సలార్ 2, ఓజి 2, దేవర 2, రాజాసాబ్ 2, హరి హర వీరమల్లు 2, బింబిసార 2, విరూపాక్ష 2, హనుమాన్ 2 లాంటి పేర్లు తరచూ వినిపిస్తున్నాయి. అంతేకాదు, పార్ట్ 3ల గురించి కూడా మాట్లాడుతున్నారు. కాంతారా 3, కేజీఎఫ్ 3, కార్తికేయ 3, దృశ్యం 3 లాంటి పేర్లు వినగానే ప్రేక్షకులకు ఆశ్చర్యం కలుగుతోంది.
కానీ వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. ఈ సీక్వెల్స్లో కొన్నే నిజంగా ముందుకు సాగుతున్నాయి. కల్కి 2 షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. జై హనుమాన్ కథ సిద్ధంగా ఉంది. జైలర్ 2 కూడా ప్లానింగ్ దశలో ఉంది. అయితే చాలా సినిమాల సీక్వెల్స్ కేవలం మాటలకే పరిమితమయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలమయ్యాయి. అలాంటి సినిమాలకు పార్ట్ 2 వస్తుందనే ఆశ పెట్టుకోవడం అర్థం లేని విషయం.
ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, సగటు సినిమాలకే కాదు, ఫ్లాప్ సినిమాలకూ సీక్వెల్స్ ప్రకటించడం. ప్రేక్షకులు ఇప్పుడు తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కేవలం ప్రచారం కోసమే అని వారికి అర్థమవుతోంది. సినిమా రిలీజ్కు ముందు హైప్ పెంచడానికే చాలా మంది పార్ట్ 2 పేర్లు ఉపయోగిస్తున్నారు.
దర్శకులు.. నిర్మాతలు ఈ విషయాన్ని గుర్తించాలి. పూర్తి కథతో మంచి సినిమా తీస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. నిజంగా సినిమా పెద్ద హిట్ అయి, కథకు కొనసాగింపు అవసరమైతేనే సీక్వెల్ ప్లాన్ చేయాలి. లేకపోతే ప్రేక్షకుల నమ్మకం తగ్గిపోతుంది. బలమైన కథ, నిజాయితీగా చేసిన సినిమా మాత్రమే దీర్ఘకాలంలో గుర్తుండిపోతుంది.
ALSO READ: Rajasekhar’s Role: శర్వానంద్ ‘బైకర్’ లో రాజశేఖర్ పాత్ర ఇదే.. ఒపీనియనే కదా మారుద్దాం!