Tollywood Ticket Hikes: ప్రీమియర్స్ కోసం గంటల తరబడి వెయిట్ చెయ్యాలి.. మరోపక్క థియేటర్లో టికెట్లు భారీ డబ్బులు ఇచ్చి తీసుకోవాలి.. అంతేకాదు ప్రీమియర్ షో లేట్ అయితే గంటలు తరబడి నిలబడాలి. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఒక సాధారణ ప్రేక్షకుడు లేకపోతే ఒక స్టార్ హీరో అభిమాని ఎదుర్కొంటున్న కష్టాలు. ఎన్ని చేసి సినిమా చూడడానికి వెళితే.. ఆ సినిమా అద్భుతంగా ఉంటే తప్ప.. యావరేజ్ గా ఉన్నా కూడా ఇంత కష్టపడి వెళ్లిన అభిమానికి ఆ చిత్రం నిరాశ పరచడం ఖాయం.
ఒక హోటల్ కి ఎటువంటి ఆశలు లేకుండా వెళ్లి ఒక రుచికరంగా సూప్ తాగిన..సంబరపడిపోతాం. అదే చిన్న సినిమాల విషయంలో జరుగుతోంది. కానీ అదే ఒక రెస్టారెంట్ భలే ఉందని చెప్పి.. అక్కడికి వెళ్లి వెయ్యి రూపాయలు ఖర్చుపెట్టి.. ఒక యావరేజ్ బిర్యాని తింటే.. బయటకి వచ్చి ఇక ఈ రెస్టారెంట్ కి వెళ్లడం వృధా అని ఫీల్ అవుతాం. ఇప్పుడు ఇదే పెద్ద సినిమాలకు జరుగుతోంది.
టికెట్ రేట్ విపరీతంగా పెంచడం.. ప్రీమియర్ల టైమ్ ముందుగా చెప్పకపోవడం.. ఇవన్నీ కూడా అభిమాని ఎదురుకుంటున్న కష్టాలు. సినిమాకు నెగిటివ్ టాక్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్లో ఇది స్పష్టంగా కనిపిస్తున్న నిజం. టికెట్ రేట్లు పెంచితే కలెక్షన్లు పెరుగుతాయనే నమ్మకంతో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. కానీ అదే హైక్ సినిమాకే పెద్ద దెబ్బ అవుతోంది.
ఇటీవల విడుదలైన ది రాజా సాబ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రీమియర్స్ విషయంలో జరిగిన ఆలస్యం..టికెట్ ధరలపై గందరగోళం సినిమాపై తొలి రోజు నుంచే ప్రతికూల ప్రభావం చూపింది. ప్రీమియర్స్ అంటే సినిమాకు బజ్ తీసుకొచ్చే అవకాశంగా పావిస్తారు. కానీ అవే షోలు నెగిటివ్ టాక్కు.. కారణమైతే పరిస్థితి మారిపోతుంది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. కంటెంట్ మీద నమ్మకం ఉండాలి. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారు. కానీ కంటెంట్ సంగతి పక్కన పెట్టి.. టికెట్ హైక్ అంటూ ప్రాధేయపడితే పరువు పోవడం తప్ప ఇంకేం జరగదు. ఒక టికెట్పై వంద రూపాయలు పెంచాలనే ఆశలో వంద కోట్ల కలెక్షన్లకు ఎసరు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇక్కడ ధురందర్ ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి.. ఏ రాష్ట్రంలోనూ టికెట్ హైక్ ఇవ్వకపోయినా ఆ సినిమా 1270 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ధర కన్నా కంటెంట్ ముఖ్యం అనేది ఈ సినిమా విషయంలో స్పష్టంగా అర్థమయిపోయింది.
ప్రేక్షకులు కూడా ఈ టికెట్ ధరలతో విసుగు చెందుతున్నారు. తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగా పెంచకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డికి థాంక్యూ చెబుతున్న వారు ఉన్నారు. అదే సమయంలో “ఇలాంటి సినిమాకు 1100 రూపాయల టికెట్ ఎందుకు?” అని ప్రశ్నిస్తున్న ప్రేక్షకులూ ఉన్నారు. కుటుంబంతో థియేటర్కు వెళ్లాలంటే ఖర్చు భారం అవుతోంది. అందుకే చాలామంది ఓటీటీకి వెయిట్ చేసే పరిస్థితి వస్తోంది.
మరో నిజం ఏంటంటే… అభిమానులు కూడా డబ్బులు ఏదో గుడ్డిగా ఖర్చు పెట్టడం లేదు. కంటెంట్ ఉంటేనే డబ్బు పెడుతున్నారు. ప్రీమియర్స్, ఫస్ట్ డే హైప్ అన్నీ కొన్ని గంటలే. అసలు ఆట మొదలయ్యేది రెండో రోజు నుంచి.. అక్కడే సినిమా నిలబడాలంటే కంటెంట్ తప్పనిసరి.
ఈ పరిస్థితులన్నింటినీ చూస్తే టాలీవుడ్ ఒక పాఠం నేర్చుకోవాలి. టికెట్ రేట్లు పెంచడం కాదు, ప్రేక్షకుడికి విలువైన వినోదం ఇవ్వడం ముఖ్యం. వందకు ఆశ పడితే, వంద కోట్లకు ఎసరు పడే ప్రమాదం ఉందని నిర్మాతలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.
ALSO READ: The Raja Saab Fire Mishap: రాజాసాబ్ థియేటర్లో మంటలు.. నిప్పు రాజేసిన ఫ్యాన్స్..!