Tamil Film Producer Mastermind In Drug Racket: దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, ఎన్సీబీ చేపట్టిన ఆపరేషన్లో అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ను అధికారులు చేధించారు. ఈ డ్రగ్ ముఠా వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూడోపెడ్రిన్కు ఇతర దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మెథాంఫేటమిన్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో సూడోపెడ్రిన్ ను కిలో రూ. 1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్ పంపుతున్నట్లు ఎన్సీబీ సమాచారం అందింది. దీనిని హెల్త్ మిక్స్ పౌడర్స్, కొబ్బరి సంబంధిత ఆహారంలో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఈ డ్రగ్ మాఫియా కదలికలపై ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టారు.
ఈ నేపథ్యంలో సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్లోని గోదాంలో తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి దాదాపు 50 కిలోల సూడోపెడ్రిన్ను స్వాధీనం చేసుకున్నాట్లు తెలిపారు. ఈ నెట్వర్క్ భారత్ సహా మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు ఎన్సీబీ విచారణలో తేలింది.
ఈ ముఠా ఇప్పటి వరకు 3,500 కిలోల సూడోఫెడ్రిను ఎగుమతి చేశారని.. దాని విలువ సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ డ్రగ్ ముఠా వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ఎన్సీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతడి ఫొటోను విడుదల చేస్తామని పోలీస్ అధికారులు వెల్లడించారు.