
Ukraine : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేలమంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ కు చెందిన 500 మందికి పైగా చిన్నారులు బలికావడం తీవ్ర విషాదకరం. స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఈ విషయాలను వెల్లడించారు.
రష్యా ఆయుధాలు, వారి ద్వేషం ఉక్రెయిన్ చిన్నారుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిన్నారులలు భవిష్యత్తులో కళాకారులుగా, క్రీడా ఛాంపియన్లుగా ఉక్రెయిన్ చరిత్ర పుటల్లో నిలిచి ఉండేవారని అన్నారు. రష్యా దాడుల వల్ల ఎంత మంది మరణించారో కచ్చితంగా చెప్పలేమన్నారు. కొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉండటం వల్ల మరణాల లెక్కలు తేల్చలేకపోతున్నామని జెలెన్స్కీ వివరించారు.
రష్యా జరిపిన తాజా దాడుల్లో రెండేళ్ల బాలిక మరణించింది. దినిప్రో నగరంలో ఓ అపార్ట్మెంట్ భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆ చిన్నారి భౌతికకాయాన్ని ఆమె తండ్రే వెలికితీయడం అందర్నీ కలచివేసింది. ఆ వ్యక్తి భార్య కూడా గాయాలతో బయటపడ్డారు. శనివారం రష్యా చేసిన దాడిలో ఐదుగురు చిన్నారుల సహా 22 మంది పౌరులు గాయపడ్డారని స్థానిక గవర్నర్ సెర్హి లిసాక్ ప్రకటించారు.