Aravind Kejriwal : దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో పర్యటిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై దాడికి యత్నం జరిగింది. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ పైకి దూసుకువచ్చిన ఓ వ్యక్తి… కేజ్రీవాల్ పై తన చేతిలోని ద్రవాన్ని విసిరారు. దాంతో అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది.. వెంటనే ఆ యువకుడిని అక్కడి నుంచి లాగేశారు.
దాడికి ప్రయత్నించిన యువకుడిని పట్టుకున్న పార్టీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారు. అనంతరం నిందితుడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. కేజ్రివాల్ పై విసిరింది…నీరు అని కొందరు అంటుంటే, లేదా సిరా విసిరాడు అని మరికొందరు చెబుతున్నారు. ఇంతకు ముందు ఛతర్పూర్-నాంగ్లోయ్లో కూడా కేజ్రీవాల్ పర్యటనలో ఇటువంటి సంఘటనలే జరిగాయి.
ఈ దాడులపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తన నాయకులపై దేశవ్యాప్తంగా బీజేపీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్పై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. ఆయనపై బీజేపీ దాడి చేయిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయి
దాడికి కొంతసేపటి ముందే దిల్లీలో రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి అంటూ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దిల్లీని రౌడీలు నడిపిస్తున్నట్లు తమకు అనిపిస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీలో సీనియర్ సిటిజన్లకు రక్షణ లేకుండా పోతుందని, వ్యాపారవేత్తలకు నిత్యం బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో నిత్యం ఏదో మూల కాల్పులు జరుగుతున్నాయని, నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని విమర్శించారు. అమిత్ షా హోం మంత్రి అయినప్పటి నుంచే దిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా తయారు అయ్యాయని అన్నారు.
గత కొన్నాళ్లుగా దిల్లీలో పరిస్థితులు బాగోలేదని, నిత్యం గొడవలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. వాటన్నింటికీ బీజేపీ నాయకులే కారణమని ఆరోపిస్తోంది. ఆ పార్టీనే రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి దాడులు, నేరాలకు ఉసిగొల్పుతున్నారంటూ విమర్శిస్తున్నారు.
కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే.. రెండు సార్లు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ తరుణంలోనే ఇలాంటి దాడులు జరగడం, వాటిపై రాజకీయ నాయకులు, పార్టీల మధ్య విమర్శలతో రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. ముఖ్యంగా..ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు ఈసారి అధికారాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో భాగంగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
స్పందించిన సీఎం అతిశీ
పట్ట పగలు బీజేపీ కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్పై దాడి చేశాడంటూ దిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మార్లెనా ఆరోపించారు. ఈ చర్య ద్వారా దిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం కనిపిస్తోందన్న ముఖ్యమంత్రి అతిశీ.. ఇలాంటి చౌకబారు చర్యలకు దిల్లీ ప్రజలు బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయని.. ఈ సారి మాత్రం సున్నా సీట్లే ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : తమిళనాడులో ఫెంగల్ తుపాన్ బీభత్సం.. విమాన సేవలకు తీవ్ర అంతరాయం
దాడికి పాల్పడిన వ్యక్తి ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన అతిశీ.. అతను బీజేపీ కార్యకర్త అని ఆరోపించారు. అందుకు ఆధారంగా.. కేజ్రీవాల్ పై దాడికి పాల్పడినప్పటి ఫోటోను, అతని వ్యక్తిగత సామాజిక ఖాతాలోని ఫోటోను పక్కపక్కన పెట్టి పోస్ట్ చేశారు. అందులో.. నిందితుడు నరేంద్ర మోదీ ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకుని ఉన్న డీపీ ఉంది.