కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ.. అన్నారం.. సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఈ మూడు బ్యారేజీల మరమ్మతులు.. పునరుద్ధరణ పనులను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి కల్నల్ పరిచిత్ మెహ్రా నేతృత్వం వహించనున్నారు. దేశంలోని అత్యుత్తమ ఇంజినీర్లు, ప్రాజెక్టు నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచడం, సాంకేతిక అడ్డంకులను తొలగించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం పేర్కొంది.
వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాజెక్టు భద్రతను నిర్ధారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం మే 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. ప్రధానంగా బ్యారేజీల పునాదుల వద్ద జియో టెక్నికల్ పరిశీలనలను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. వర్షాలు మొదలైతే నదిలోకి నీరు వచ్చే అవకాశం ఉన్నందున.. ఆలోపే కీలకమైన భూగర్భ పరీక్షలు.. మట్టి నమూనాల సేకరణ ముగించాలని స్పష్టం చేసింది. ఈ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకల్లా ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపాల్సి ఉంటుంది.
కేంద్ర జల సంఘం (CWC).. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ పనులన్నీ సాగనున్నాయి. బ్యారేజీల డిజైనింగ్ మార్పులు.. దెబ్బతిన్న నిర్మాణాల బలోపేతంపై నిపుణుల బృందం దృష్టి సారిస్తుంది. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. రోజువారీ యాక్షన్ ప్లాన్ను రూపొందించుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించింది. ప్రాజెక్టు భద్రత రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది.
ఈ కమిటీ ఏర్పాటుతో కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల ప్రక్రియలో స్పష్టత వచ్చింది. బ్యారేజీల కింద ఇసుక కోతకు గురైన ప్రాంతాలను గుర్తించడం.. కుంగిన పిల్లర్ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటి కీలక పనులు యుద్ధ ప్రాతిపదికన సాగనున్నాయి. కాలంతో పోటీ పడుతూ ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి నిర్మాణ పనుల వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
ALSO READ: Delimitation : తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించారా?