Amit Sha : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. అసోంలోని గువాహటి లోక్ప్రియా గోపినాథ్ బర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి 10.45 గంటలకు విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వాస్తవంగా ఈ విమానం త్రిపుర రాజధాని అగర్తలలోని మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రాయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించారు. అనంతరం గువాహటి విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానాశ్రయంలో అమిత్ షాకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్వాగతం పలికారు. అమిత్ షా ఆ తర్వాత అక్కడి నుంచి గువాహటిలోని హోటల్ రాడిసన్ బ్లూకు చేరుకుని రాత్రి బస చేశారు .
కేంద్రహోంమంత్రి అమిత్ షా బుధవారం రాత్రి అగర్తల వెళ్లాల్సి ఉంది. రాత్రి పది గంటల సమయంలో ఆయన మహారాజా విమానాశ్రయానికి చేరుకోవాలనుకున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా అది సాధ్యపడలేదు. ఈ ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం రెండు ప్రచార రథయాత్రలను అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది. వాతావరణ పరిస్థితులపై అనుమతులు వచ్చిన తర్వాత అగర్తలాకు బయలుదేరి వెళ్తారు.
మరోవైపు ఉత్తరాధిని చలి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజగజా వణుకుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఈ సీజన్లో అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాధిలోని అనేక రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతికూల వాతావరణ ప్రభావం విమాన సర్వీసులపై పడింది.