Anna Hazare: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానం క్లీన్చిట్ ఇవ్వడాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్వాగతించారు. దేశంలో న్యాయవ్యవస్థే అత్యున్నతమైనదని.. కోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అహల్యనగర్ జిల్లాలో గల తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రజాస్వామ్యం సక్రమంగా నడుస్తోందంటే దానికి బలమైన న్యాయ వ్యవస్థే కారణమని కొనియాడారు. ఒకవేళ న్యాయవ్యవస్థ పటిష్టంగా లేకపోతే నేరగాళ్లదే పైచేయి అవుతుందని.. దేశంలో అల్లర్లు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో కేజ్రీవాల్ అరెస్టుపై తాను చేసిన విమర్శల గురించి ప్రస్తావిస్తూ అన్నా హజారే కీలక వివరణ ఇచ్చారు. ఆ సమయంలో కేజ్రీవాల్పై ఆరోపణలు కేవలం గాలిలోనే ఉన్నాయని.. న్యాయస్థానం నుండి ఎలాంటి తీర్పు వెలువడలేదని గుర్తు చేశారు. ఇప్పుడు న్యాయవ్యవస్థే ఆయనకు ఎలాంటి పాత్ర లేదని తేల్చి చెప్పినందున.. ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కేజ్రీవాల్.. మనీశ్ సిసోదియా ఇద్దరూ ఒకప్పుడు తన వద్ద పని చేసిన కార్యకర్తలేనని ఆయన గుర్తు చేసుకున్నారు. 2011లో ‘ఇండియా అగైన్స్ట్ కరప్షన్’ ఉద్యమంలో వీరంతా కలిసి పని చేసినప్పటికీ.. ఆ తర్వాత రాజకీయ మలుపు తీసుకోవడంతో హజారే దూరంగా ఉన్నారు.
అరవింద్ కేజ్రీవాల్కు ఈ సందర్భంగా అన్నా హజారే ఒక విలువైన సలహా ఇచ్చారు. ఇకనైనా స్వంత ప్రయోజనాల గురించి.. రాజకీయ పార్టీ గురించి ఆలోచించడం మానేసి సమాజం.. దేశం కోసం నిస్వార్థంగా పనిచేయాలని హితవు పలికారు. గతంలో కేజ్రీవాల్పై విమర్శలు చేస్తూ జనలోక్పాల్ ఉద్యమంలో భాగమైన వ్యక్తే అవినీతి కేసులో పట్టుబడటం దురదృష్టకరమని హజారే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాజకీయ ఆకాంక్షలు 2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని దెబ్బతీశాయని.. కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని కేజ్రీవాల్ వమ్ము చేశారని అప్పట్లో ఆరోపించారు.
శుక్రవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్.. సిసోదియా సహా 21 మందిని ఈ కేసు నుండి విముక్తి చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదా నేర ఉద్దేశం కనిపించలేదని పేర్కొంటూ దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు తప్పుబట్టింది. 2024 మార్చి 21న అరెస్టు అయిన కేజ్రీవాల్.. సుమారు 155 రోజుల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా వెలువడిన ఈ క్లీన్చిట్ తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరట లభించినట్లయింది.
Read Also: 10 స్థానాలు గెలిచినా.. రాజకీయాల నుండి తప్పుకుంటా.. మోదీకి కేజ్రీవాల్ ఛాలెంజ్