Arvind Kejriwal: ఢిల్లీ మద్యం విధానంపై తప్పుడు కేసు నమోదు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర పన్నారని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ దాఖలు చేసిన అభియోగాలను తోసిపుచ్చుతూ కోర్టు ఇచ్చిన క్లీన్చిట్ చారిత్రకమని ఆయన అభివర్ణించారు. మనీశ్ సిసోదియా, ఇతర పార్టీ నేతలతో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాజకీయ ప్రతీకారంతోనే తమపై లేని స్కామ్ను సృష్టించారని ధ్వజమెత్తారు. ఇదే కేసులో ఈడీ నమోదు చేసిన ఆరోపణలను సైతం కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. తాము నిజాయితీపరులం అని న్యాయస్థానం నేడు ధృవీకరించిందని భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పోకడల వల్ల దేశ రాజధాని ఢిల్లీ సర్వనాశనమైందని కేజ్రీవాల్ విమర్శించారు. అధికారం కోసం ప్రధాని మోదీ.. అమిత్ షా పన్నిన కుట్రల పర్యవసానాలను మూడు కోట్ల మంది ఢిల్లీ ప్రజలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ధైర్యముంటే దేశ రాజధానిలో మళ్లీ ఎన్నికలు జరపాలని ఆయన ప్రధానికి సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఎన్నికల్లో బీజేపీకి పది స్థానాల కంటే ఎక్కువ వస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. కేవలం తప్పుడు కేసులతో భయపెట్టి పార్టీని నిర్వీర్యం చేయాలని చూశారని.. కానీ న్యాయమే అంతిమంగా గెలిచిందని పేర్కొన్నారు.
మరోవైపు మద్యం కేసులో కేజ్రీవాల్.. మనీశ్ సిసోదియా సహా 23 మందికి క్లీన్చిట్ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దర్యాప్తులో తాము గుర్తించిన కీలక అంశాలను.. సాక్ష్యాలను ప్రత్యేక న్యాయస్థానం విస్మరించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. తీర్పులో పేర్కొన్న అంశాలు చట్టపరంగా ఆమోదయోగ్యం కావని.. హైకోర్టులో వాస్తవాలు నిరూపిస్తామని సీబీఐ స్పష్టం చేసింది. దాదాపు 600 పేజీల తీర్పులో కోర్టు సీబీఐ దర్యాప్తు తీరును తప్పుబట్టడం గమనార్హం.
Read Also: Arvind Kejriwal Tears: న్యాయస్థానం తీర్పు.. కంటతడి పెట్టిన మాజీ సీఎం కేజ్రీవాల్, ఏం జరిగింది?