Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ముఖ్యనేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. సవాళ్లకు ప్రతి సవాళ్ల విసురుకుంటూ పలువురు నేతలు విమర్శలకు దిగారు.
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. అధికారం దక్కాలంటే 113 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. ఇక మొత్తం 224 సీట్లలో 36 సీట్లు ఎస్సీ, 15 ఎస్టీ లకు రిజర్వ్ చేయబడ్డాయి. మే 10న ఓటింగ్ జరుగనుంది. అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జీడీఎస్ పార్టీల మధ్య పోరు నడుస్తోంది. ఎన్నికలను ప్రశాంతంగా జరపడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 5.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో మొదటిసారి ఓటును వేస్తున్నవారు 9 .17 లక్షల మంది ఉన్నారు. మరి కర్ణాటక ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ఎవరికి పట్టం కట్టబెడతారా ? ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.