Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన తాజా ఘటనలో.. బళ్లారి శివార్లలో ఉన్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన విలాసవంతమైన మోడల్ హౌస్ను గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. సుమారు రూ. 3 కోట్ల విలువైన ఈ నివాసంపై జరిగిన దాడితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
బళ్లారి శివార్లలోని గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఈ మోడల్ హౌస్లోకి చొరబడిన దుండగులు మొదట కిటికీలు, తలుపులను ధ్వంసం చేశారు. అనంతరం లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించగా.. ఇంటిలోని ఖరీదైన ఫర్నిచర్, అలంకరణ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని గాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన నేరుగా ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన మండిపడ్డారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలను సేకరించారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన బళ్లారిలో రాజకీయ సెగను మరింత రాజేసింది.
కర్ణాటకలోని బళ్లారి శివారులో గాలి జనార్థన్ రెడ్డికి చెందిన రూ.3 కోట్ల విలువైన మోడల్ హౌస్ కు నిప్పు పెట్టిన దుండగులు
స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపణ
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు pic.twitter.com/9lS8gSViwf
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2026