Kerala: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరొక సంచలనం. కాంగ్రెస్ యువనేత ఏడీ థామస్ చట్ట సభల్లోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు ఆయన పేరు కేరళ వ్యాప్తంగా మార్మోగుతోంది. కొన్నాళ్ల కిందట సీఎం పినరయి విజయన్ యాత్రలో ఆందోళనకు దిగిన నిరసనకారుడు ఆయన. ఇప్పుడు అలప్పుళ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. తనపై జరిగిన దాడిని రాజకీయంగా మార్చుకుని సంచలన విజయం సాధించాడు.
కేరళలో కాంగ్రెస్ యువనేత సంచలనం
కేరళ శాసనసభ ఎన్నిక ఫలితాల్లో 30 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి ఏడీ థామస్ సంచలన విషయం సాధించారు. లెఫ్ట్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే పీపీ చిత్తరంజన్పై 21 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. లెఫ్ట్ కంచుకోట అలప్పుళ నియోజకవర్గం. వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఆ స్థానం నుంచి థామస్ విజయం సాధించాడు.
ఇంతకీ థామస్ ఎవరు, నేపథ్యం ఏంటి? ఇంకాస్త డీటేల్స్లోకి వెళ్తే.. థామస్ తండ్రి డొమినిక్ జాక్సన్.. చేపలు అమ్మి పిల్లలను చదివించాడు. మరారికుళం నార్త్లో డొమినిక్ జాక్సన్-అక్కమ్మ దంపతులకు జన్మించాడు థామస్. పెంకుటిల్లులో పెరిగిన థామస్, చిన్నతనంలో తండ్రితో కలిసి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేవాడు.
థామస్ దెబ్బకు కమ్యూనిస్టుల కంచుకోట బద్దలు
ఓ వైపు ఇంటి పనులు చేస్తూనే.. మరోవైపు విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. కాంగ్రెస్ తరపున అనేక ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఆయనపై 18 కేసులు నమోదయ్యాయంటే ఎంత దూకుడు అడుగులు వేసేవాడో అర్థమవుతోంది.
పరీక్ష పత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, ప్లస్ వన్ సీట్ల కొరతపై వరకు జరిగిన నిరసనలలో పాల్గొని అందరిలో గుర్తింపు పొందాడు. ముఖ్యమంత్రి విజయ్ నవ కేరళ యాత్రలో నల్ల జెండా ప్రదర్శించి దాడికి గురయ్యాడు ఏడీ థామస్. ఈ ఘటనతో ఆయన పేరు కేరళ వ్యాప్తంగా మార్మోగింది. ఆ యువకుడి పోరాట పటిమను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ.
ALSO READ: విజయ్ ఆస్తులు రూ. 624 కోట్లు.. సంపద అంతా రియల్ ఎస్టేట్, మరి కార్ల మాటేంటి?
ఏకంగా కమ్యూనిస్టుల కంచుకోటలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలప్పుళ నుంచి పోటీ చేసి దాదాపు 20 వేలకు పైగానే భారీ మెజార్టీ సాధించి విజయం సాధించాడు. కొడుకు తన మాదిరిగా మిగిలిపోతాడని భావించానని భయపడ్డానని, ఇప్పుడు ప్రజలకు నాయకత్వం వహించబోతున్నాడని చెప్పుకొచ్చాడు. తుఫానుకు దెబ్బతిన్న పడవ నుండి రాష్ట్ర అధికార పీఠాల వరకు సాగే ప్రయాణం ఒక సినిమా దృశ్యంలా కనిపిస్తుంది.