Hyderabad Metro Phase 2: దేశ రాజధాని ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలను మాత్రం కేంద్రం మరోసారి పక్కనపెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ మెట్రో ఫేజ్-5A (Delhi Metro Phase-5A) విస్తరణకు రూ.12,015 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల విజ్ఞప్తుల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆవేదన రాష్ట్ర వర్గాల్లో నెలకొంది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Hyderabad Metro Phase-II) నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, సుస్థిరాభివృద్ధికి 76.4 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ అత్యవసరమని ఆయన వివరించారు. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను (DPRs) సమర్పించి, దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా (Joint Venture) చేపట్టాలని కోరారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థనను కేంద్రం ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.
మరోవైపు, ఢిల్లీలో మెట్రో విస్తరణకు మాత్రం కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. తాజాగా ఆమోదించిన ఫేజ్-5A కింద 16 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా 13 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ఇందులో 10 అండర్ గ్రౌండ్, 3 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా రూ.9,570 కోట్లతో రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ వరకు, రూ.1,419 కోట్లతో ఎయిరో సిటీ నుంచి టెర్మినల్-1 వరకు, మరియు రూ.1,024 కోట్లతో తుగ్లకాబాద్ నుంచి కాలింది కుంజ్ వరకు మెట్రో మార్గాలను నిర్మించనున్నారు. ఈ విస్తరణతో ఢిల్లీ మెట్రో నెట్వర్క్ 400 కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం చెరో రూ.1,759 కోట్లు భరించనుండగా, మిగిలిన రూ.5,278 కోట్లు రుణం ద్వారా సేకరించనున్నారు.
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మెట్రో సేవలు ఐదు రెట్లు పెరిగాయని కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి. 2014లో కేవలం 4 నగరాల్లో, 248 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రో సేవలు.. ప్రస్తుతం 26 నగరాలకు, 1,090 కిలోమీటర్లకు విస్తరించాయి. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 28 లక్షల నుంచి 1.15 కోట్లకు పెరిగింది. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ నిలిచింది. వికసిత భారత్ లక్ష్యంగా మౌలిక సదుపాయాలకు రూ.12.35 లక్షల కోట్లు కేటాయించిన మోదీ సర్కార్, హైదరాబాద్ మెట్రో విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.
Read Also: Ap Govt: ఎట్టకేలకు ఏపీలో తొలి అడుగు.. గిరిజన గ్రామాలకు డ్రోన్ ద్వారా వైద్యం, వచ్చేనెల నుంచి