క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో శాంతి, కరుణ, ఆశలను నింపాలని ఆకాంక్షించారు. క్రీస్తు చూపిన ప్రేమ మార్గం, ఆయన బోధనలు మన సమాజంలో సామరస్యాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేయాలని కోరారు.
క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వమే అన్ని మతాల అంతిమ సారాంశమని, ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, త్యాగ గుణాలు మానవాళికి దిశానిర్దేశం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
క్రిస్మస్ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి. ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిల పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ కెథడ్రల్ చర్చిలో 101 సంవత్సర క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అనవాయితీ ప్రకారం శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలో ప్రతిష్టించారు. అనంతరం తెల్లవారుజాము ప్రార్థనలతో క్రిస్మస్ మహోత్సవ కార్యక్రమం మొదలుపెట్టారు. భక్తులకు ఇన్చార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ దైవవాక్య సందేశం ఇచ్చారు.
భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. వాజ్పేయి సైద్ధాంతిక దృఢత్వం, దేశభక్తి రాజకీయాలకు ఆదర్శమని కొనియాడారు. శ్రేష్ఠులు ఏది ఆచరిస్తే, లోకం దాన్నే అనుసరిస్తుంది అనే శ్లోకాన్ని ఉటంకిస్తూ.. ఆయన చూపిన బాటలో నడవడమే నిజమైన గౌరవమని మోదీ పేర్కొన్నారు.
మియాపూర్ కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్తుతి ఆరాధన చేసి క్రిస్మస్ సందేశాన్ని వినిపిస్తున్నారు. టెంపుల్ ఫౌండర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆరాధనలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో తరలి వస్తున్న క్రైస్తవులతో చర్చి ప్రాంగణం సందడిగా మారింది.
మంచిర్యాల హమాలివాడలోని సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు మానవాళికి ఆదర్శమని, ప్రేమ, కరుణ, సోదరభావంతో ప్రతి ఒక్కరూ ఐక్యంగా జీవించాలని ఆమె పిలుపునిచ్చారు.
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని జయభేరి కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాధు వాస్వానీ స్కూల్కు చెందిన బస్సు వేగంగా వచ్చి ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న తండ్రీకొడుకులు కింద పడిపోయారు. బస్సు ఆపకుండా ముందుకు వెళ్లడంతో, బాలుడిని బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లంది. ఈ ఘటనలో తండ్రీకొడుకులకు గాయాలయ్యాయి.
శంషాబాద్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వెళ్తున్న యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. శంషాబాద్ మండలంలోని కవేలిగూడ వద్ద ఘటన జరిగింది. మృతుడు మొయినాబాద్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మహేష్గా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మంచు దుప్పటి కప్పేసింది. చలితీవ్రతకు ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం స్తంభించింది. రహదారులపై మంచు వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతుండగా, వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కిషన్ నాయక్ ఇంటితో పాటు 12 చోట్ల ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు.
విజయవాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్చిల బాట పట్టారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. చర్చ్ ఫాదర్స్ వద్ద ఆశీర్వాదం అందుకుంటున్నారు. క్రైస్తవుల రాక సందర్భంగా అన్ని చర్చిల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముమ్మిడివరం నియోజకవర్గం యానాంలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి. చారిత్రక ఆర్సిఎం చర్చి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ మార్గంలో నడవాలని పాస్టర్లు సందేశాన్ని ఇచ్చారు.
భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ఏపీ ప్రభుత్వం. వెంకటపాలెంలోని అటల్ జీ స్మృతి వనంలో ఏర్పాటు చేసిన.. 14 అడుగుల ఎత్తులో ఉన్న వాజ్ పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఆవిష్కరించనున్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. అల్లూరి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కంటిన్యూ అవుతున్నాయి. చింతపల్లి 7 లంబసింగి 6 పాడేరు 8, అరకు 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా అలముకుంది. చలి తీవ్రతకు జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతు ఉపశమనం పొందుతున్నారు.
ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడుతోంది. పెద్దఎత్తున శాహెద్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగిస్తోంది. మరోవైపు.. వీటిని మార్గమధ్యంలోనే కట్టడి చేసేందుకు ఉక్రెయిన్ ఇంటర్సెప్టర్ డ్రోన్లను తయారు చేస్తోంది. తక్కువ ఖర్చుతో చిన్న పరిమాణంలో, ఎక్కువ ఎత్తులో ప్రయాణించేలా రూపొందిస్తోంది. వైల్డ్ హార్నెట్స్ అనే ఉక్రెయిన్ ఆయుధ తయారీ సంస్థ తాము నిర్మించిన ‘స్టింగ్’ డ్రోన్లు గగనతలంలో రష్యా శాహెద్లపై దాడులు చేసిన దృశ్యాలను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది.
దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం, స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేయడం ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’కు ఊతమివ్వడం అత్యవసరమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇండియన్ డిఫెన్స్ ఎకౌంట్స్ సర్వీసు అధికారుల బృందం బుధవారం రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ఆధారిత ఆర్థిక విశ్లేషణ వంటి ఆధునిక నైపుణ్యాలు నేర్చుకోవాలని వారికి సూచించారు.
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్లైనాస్ విమానంలో బాంబులు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తి మొయిల్ పంపాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి బాంబ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.
భారత హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్ పేరును క్రీడా అవార్డుల సెలక్షన్ కమిటీ.. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు కోసం సిఫారసు చేసింది. ఈ ఏడాది భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి కమిటీ అతడి పేరుని ప్రతిపాదించింది.
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కలయికలో సినిమా ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్పై నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చిన అల్లు అర్జున్ను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హైదరాబాద్లో కలిసి కథని వినిపించారు. ఇంకొన్ని చర్చల తర్వాత ఈ ప్రాజెక్ట్పై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి.