![](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/02/chennai-schools-in-1024x576.jpg)
Bomb Threat to Schools in Chennai : తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో ఉన్న పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. చెన్నై వ్యాప్తంగా 5 స్కూళ్లకు గురువారం బాంబు బెదిరింపులతో కూడిన ఈ-మెయిల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సదరు పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో.. విద్యార్థులు, సిబ్బందిని తక్షణమే ఇంటికి పంపి.. పాఠశాలలను మూసివేశారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో రంగంలోకి దిగి ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు.
Read More : కర్ణాటకలో హుక్కా బ్యాన్.. కారణం ఆ కేసులేనా ?
గోపాలపురం, జేజే నగర్, ఆర్ఏ పురం, అన్నానగర్, పరిముణా ప్రాంతాల్లో ఉన్న ఐదు ప్రముఖ పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తికి సంబంధించిన ఈ-మెయిల్ నుంచి బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆయా స్కూళ్లలో తనిఖీలు చేపట్టగా.. ఇంతవరకూ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని, ఈ-మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీని కనుగొనే ప్రయత్నంలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా.. గతేడాది డిసెంబర్ లో బెంగళూరులోనూ ఇలాగే కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో బెంగళూరు మొత్తం సంచలనం రేగింది. తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలలకు చేరుకుని.. తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లారు. ఒకేరోజు 68 పాఠశాలలను బెదిరిస్తూ దుండగులు ఈ-మెయిల్స్ పంపగా.. పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో.. అవన్నీ నకిలీ బెదిరింపులేనని ప్రాథమికంగా నిర్థారించి.. ఈ-మెయిల్స్ పంపినవారిపై దర్యాప్తు చేపట్టారు.