
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం తర్వాత చాలామంది వ్యక్తం చేసిన అనుమానం ఒక్కటే. రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాక.. మూడో రైలుకు సిగ్నల్ ఎలా ఇచ్చారు? ఆ ట్రైన్ను ముందుగానే ఆపేయొచ్చు కదా? ఇదే అందరి డౌట్. మొత్తం 20 నిమిషాల గ్యాప్లో ప్రమాదాలు జరిగాయని మొదట్లో వార్తలు వచ్చాయి. 20 నిమిషాలంటే చాలా సమయమే కదా.. మూడో రైలును ఆపేయాల్సి ఉండే అంటూ ఎవరికి వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ, ప్రాథమిక దర్యాప్తు తర్వాత ప్రమాదం జరిగిన ఘటనపై క్లారిటీ వస్తోంది. ఆ సమయంలో అక్కడ అసలేం జరిగిందనే దానిపై అనుమానాలు వీడుతున్నాయి.
లోక్ మోటీవ్ ఆర్టీఎస్ ప్రకారం ఏ టైమ్కి ఎంత స్పీడ్లో రైలు వెళ్తుందనేది తెలుస్తుంది. సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు కోరమాండల్ ఎక్స్ప్రెస్ జీరో సెకన్స్కి వచ్చింది. అప్పటి వరకు నడుస్తున్న ఇంజిన్ ఒక్కసారిగా జీరో అయిపోయింది. అంటే, సరిగ్గా ఆ టైమ్కే కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురై ఇంజిన్ నిలిచిపోయిందని తెలుస్తోంది.
కోరమాండల్ ఆగిపోయిన నిమిషం గ్యాప్లోనే.. ఎదురుగా మరో మెయిన్ లైన్లో వస్తున్న హౌరా-బెంగళూరు రైల్ కూడా జీరో కి.మీ స్పీడ్ నమోదుచేసింది. అంటే, కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్లైన్లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టి పడిపోగానే.. ఆ నెక్ట్స్ మినిట్లోనే మరో ట్రైన్ పక్కలైన్లోకి రావటం.. దీని బోగీలు దానికి తగిలి.. హౌరా-బెంగళూరు ఎక్స్ప్రెస్ చివర్లో ఉనర్న బోగీలు కూడా బోల్తా పడ్డాయని టెక్నికల్ డీటైల్స్ను బట్టి తెలుస్తోంది. అంటే, ఆ రెండు రైళ్ల మధ్య గ్యాప్ నిమిషం కూడా లేదని తేలిపోతోంది.
ప్రమాదం జరిగిన చోట రెండు మెయిన్ లైన్స్, రెండు లూప్ లైన్స్ ఉన్నాయి. రెండు మెయిన్లైన్ల మీదుగా ఆ రెండు ట్రైన్స్కు ఒకేసారి సిగ్నల్ ఇచ్చారు. ఒకటి ఎడమవైపు, మరోటి కుడివైపు.. దేని దారిలో ఆ ట్రైన్ వెళ్లిపోవాలి. కానీ, 130 కిలోమీటర్ల వేగంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలును ఢీకొట్టడంతో.. బోగీలు పట్టాలు తప్పి రెండో మెయిన్ లైన్పై పడ్డాయి. అయితే, అప్పటికే హౌరా ఎక్స్ప్రెస్ ఘటనా స్థలాన్ని దాటేసి కాస్త ముందుకు వెళ్లిపోయింది. కానీ, రైలు పూర్తిగా క్రాస్ చేయలేదు. బోల్తా పడిన కోరమాండ్ రైలు బోగీలకు.. హౌరా ట్రైన్ యొక్క లాస్ట్ బోగీలు తగిలి అది కూడా పట్టాలు తప్పింది. అందుకే హౌరా ఎక్స్ప్రెస్కు ప్రమాద తీవ్రత తక్కువగా ఉంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ కనుక మరో నిమిషం ముందుగా వచ్చి పడిపోయి ఉంటే.. ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని.. హౌరా ఎక్స్ప్రెస్ రైలు మరిన్ని బోగీలు పట్టాలు తప్పి.. మరింత దారుణ పరిస్థితి వచ్చిఉండేదని నిపుణులు చెబుతున్నారు.