Cockroach Janta Party: దేశవ్యాప్తంగా ఉద్యమానికి రెడీ అవుతోంది కాక్రోచ్ జనతా పార్టీ. తొలుత పరీక్షల అక్రమాలపై ఫోకస్ చేసింది. పుణే నుంచి ఉద్యమం మొదలుపెట్టనున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వెల్లడించారు. జూన్ 20న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు ప్లాన్ చేసింది.
దేశవ్యాప్త ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం
కాక్రోచ్ జనతా పార్టీ క్రమంగా ఉద్యమాల వైపు దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా యువతను కూడగట్టేందుకు ప్లాన్ చేసింది. నీట్, ఇంటర్ పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభంచనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు.
గురువారం పూణెలో సావిత్రిభాయి యూనివర్సిటీ ప్రాంగణంలో సాయంత్రం ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తేల్చిచెప్పారు. పార్టీ విద్యా మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మా పార్టీ చేపట్టే ఆందోళనను శాంతియుతంగా చేపడతామని స్పష్టం చేశాడు. సీజేపీ నిరసనలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ పాల్గొంటారు.
మంత్రి రాజీనామాకు డిమాండ్.. ఈనెల 20 జంతర్ మంతర్ వద్ద ఆందోళన
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడం, పరీక్ష ఫలితాలను సకాలంలో విడుదల చేయడం, ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత పెంచడం, పరీక్షల నిర్వహణ కోసం జవాబుదారీ తనాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. పరీక్షల నిర్వహణలో లోపాల వల్ల విద్యార్థుల ఇబ్బందులను మేనిఫెస్టోలో ప్రస్తావిస్తామని తెలిపారు.
పుణే నుంచి ప్రారంభమయ్యే ఉద్యమాన్ని దేశంలోని వివిధ నగరాలకు విస్తరించనున్నట్లు మనసులోని మాట వెల్లడించారు. జైపూర్, లక్నో, అమృత్సర్, బెంగళూరు వంటి నగరాల్లో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. జూన్ 20న ఢిల్లీలోని జంతర్మంతర్లో భారీ ఆందోళన చేపట్టనున్నట్లు తెలియజేశారు.
ALSO READ: నీట్ లీకేజీలపై రాహుల్ గాంధీ పోరాటం.. యువతకు అండగా కాంగ్రెస్- మల్లిఖార్జున ఖర్గే
కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. దాదాపు కోటి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమస్యలపై దృష్టి పెట్టకుండా సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టారు.
యువతను ప్రభుత్వం విస్మరించకూడదని, దేశంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నారు. పరీక్షలకు సంబంధించిన ఆందోళనలను ఎత్తి చూపుతూ సోషల్ మీడియా ప్రచారం ఫేమస్ అయ్యింది కాక్రోచ్ జనతా పార్టీ. విద్యా రంగంలో సంస్కరణల కోసం వాదించే యువత నేతృత్వంలోని వేదికగా తనను తాను నిలబెట్టుకుంది.