CJ Roy Confident Group: ప్రముఖ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సి.జె. రాయ్ బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయన కార్యాలయాలపై దాడులు నిర్వహించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ విషాదకర ఘటన చోటుచేసుకోవడం పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. రిచ్మండ్ సర్కిల్ సమీపంలోని లాంగ్ఫోర్డ్ రోడ్డులో ఉన్న తన ఛాంబర్లో రాయ్ తుపాకీతో కాల్చుకోగా, తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆయనను వెంటనే హెచ్.ఆర్.ఎస్ లేఅవుట్లోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు ఇంకా ప్రాంగణంలోనే ఉన్న సమయంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు రాయ్ ఛాంబర్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఆయన స్వయంగా తుపాకీతో కాల్చుకున్నట్లు దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనా స్థలం నుంచి పిస్టల్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, రాయ్ ఆత్మహత్యకు ముందు ఏవైనా డెత్ నోట్ రాశారా లేదా మొబైల్ ఫోన్లో ఎవరికైనా సందేశాలు పంపారా అనే అంశాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కాల్ డేటా, సోషల్ మీడియా ఖాతాలను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు.
కేరళకు చెందిన సి.జె. రాయ్ బెంగళూరులోనే పెరిగారు. అమెరికన్ సంస్థ హెచ్పీ లో పనిచేసిన ఆయన, 2006లో కాన్ఫిడెంట్ గ్రూప్ను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వందలాది ప్రాజెక్టులను నిర్మించిన ఆయనకు కార్లంటే ఎంతో మక్కువ. విలాసవంతమైన కార్ల సేకరణతో ఆయన తరచూ వార్తల్లో ఉండేవారు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన రాయ్, అకస్మాత్తుగా ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఆయన కుటుంబ సభ్యులను, ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Also: Indonesia: ఘోరం.. పోలీసులకు తప్పని శిక్ష, అందరూ చూస్తుండగానే మహిళకు 140 కొరడా దెబ్బలు