Delhi: దేశవ్యాప్తంగా ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను ఆదివారం నుంచి పెంచేశాయి గ్యాస్ కంపెనీలు. దీనివల్ల దిగువ, మధ్య తరగతిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ధరల పెంపును నిరసిస్తూ మోదీ ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించింది కాంగ్రెస్ పార్టీ.
గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం
దేశంలో ఆయిల్-గ్యాస్ ధరలను మోదీ ప్రభుత్వం పెంచుకుంటూ పోవడంపై కాంగ్రెస్ పార్టీ అగ్గి మీద గుగ్గిలమైంది. అంతేకాదు మోదీ సర్కార్ వ్యవహారశైలిని దుమ్మెత్తి పోసింది. ఈ నేపథ్యంలో ధరల పెంపు ప్రశ్నిస్తూ కేవలం మూడే మూడు ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే.
గృహ వినియోగుదారులు ఉపయోగించే ఎల్పీజీ ధరల జ్వాలలు సామాన్యుల వంట గదులను నాశనం చేసేలా ఉన్నాయని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ఖర్గే. మోదీ ప్రభుత్వం కేవలం నాలుగు నెలల్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరను 89 రూపాయలు పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు.
మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మూడు ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
తొలి ప్రశ్న.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా 41 దేశాల నుండి ఇంధనాన్ని వైవిధ్యపరుస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో గొప్ప వాగ్దానాలు చేశారని, అదెక్కడిదని లేవనెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎల్పీజీ కొరత ఎందుకు ఉంది?
రెండో ప్రశ్న.. 2025-26 ఏడాదిలో ఉజ్వల పథకం కింద ఉన్న 5.56 కోట్ల కుటుంబాలు కనీసం ఒక్క రీఫిల్ కూడా పొందలేదు. వీరిలో 3.30 కోట్ల కుటుంబాలు ఒక్క సిలిండర్ కూడా తీసుకోలేదు. ఇదంతా పశ్చిమాసియా సంక్షోభానికి ముందే జరిగింది. మోదీ ప్రభుత్వం చేస్తున్నది దోపిడీ ఫలితం కాదా?
ALSO READ: తమిళనాట పాత పార్టీల్లో వణుకు మొదలు.. జెన్ జెడ్ ఎఫెక్ట్, అన్నామలై సరికొత్త రికార్డు
యూపీఏ హయాంలో ధరల పెరుగుదలపై మోదీ, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. గడిచిన పుష్కర కాలంలో మోదీ ప్రభుత్వం గృహ వినియోగదారుల ఎల్పీజీ సిలిండర్ ధరను 530 రూపాయల మేరా పెంచింది వాస్తవం కాదా?ఇప్పుడు బీజేపీ నాయకులు సిలిండర్లతో రోడ్లపైకి ఎందుకు రావడం లేదు? లేవనెత్తారు.
కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన మూడు ప్రశ్నలపై మోదీ సర్కార్ చెబుతుందా? లేకుంటే ఈ పాయింట్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా? ఇదంతా పశ్చిమాసియా పరిస్థితులు ఇందుకు కారణమని తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా? ఇలా కాంగ్రెస్-బీజేపీ నేతలు రకరకాలుగా ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.