Chinta Mohan: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వైఖరి వల్ల దేశంలో రాజ్యాంగం గాల్లో కలిసిపోయే ప్రమాదం ఏర్పడిందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీ వేదికగా పార్లమెంట్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు సాగించిన దమనకాండను తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దమనకాండ
న్యాయం చేయాలంటూ పార్లమెంట్ వద్దకు వచ్చిన విద్యార్థుల గొంతుపై కాళ్లు పెట్టి తొక్కి, లాఠీలతో దారుణంగా కొట్టారని చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే పార్లమెంట్ ఆవరణలో ఇలాంటి ఘోరమైన ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచి, ప్రధాని నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అత్యంత అమానుషంగా అడ్డుకున్నారని మండిపడ్డారు.
రాహుల్, ప్రియాంకలపై నిర్బంధం
రాహుల్ గాంధీ కాళ్లూ చేతులు కట్టేసిన రీతిలో పోలీసులు ప్రవర్తించారని, ప్రియాంకా గాంధీని ఆక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. అంతటితో ఆగకుండా, తన పిల్లల వద్దకు వెళ్లకుండా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సైతం పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మోదీ, అమిత్ షాల దిశా నిర్దేశంలోనే పోలీసు వ్యవస్థ ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
ప్రధాని మోదీ ఐదో తరగతి వరకే చదివారని, ఆయనకు రాజ్యాంగంపై కనీస విజ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి ప్రధానిగా ఉండటం దేశానికి చేటని, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ‘అమిత్ షా రాజ్యాంగాన్ని’ అమలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షాల చర్యలు దేశాన్ని రెండుగా విభజించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు విజ్ఞప్తి
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్ల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా వ్యవహరించాలని కోరారు. వారి ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకూడదని, వారి జీవనోపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చింతా మోహన్ సూచించారు.
Also Read: ఎల్ నినో భయాలకు చెక్! పవన్ కళ్యాణ్ ముందస్తు వ్యూహం.. ఆ జిల్లాలకు పండగే!