Dog Bite New Rules: ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. రహదారులు, గల్లీల్లో ఎవరైనా వెళ్తే చాలు.. వెంటబడి కరుస్తున్నాయి. ఈ వ్యవహారం జఠిలం కావడంతో సుప్రీంకోర్టు కన్నెర్ర జేసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో రాష్ట్రప్రభుత్వాలు చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది. పలు రాష్ట్రాలకు అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ క్రమంలో పెంపుడు కుక్కల యజమానులకు డెహ్రాడూన్ మున్సిపల్ కార్పొరేషన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇంతకీ ఆ హెచ్చరిక ఏంటి? పెంపుడు కుక్క పొరపాటున ఎవరినైనా కరిస్తే యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు ఖాయం.
పెంపుడు కుక్కలు కరిస్తే ఓనర్పై ఎఫ్ఐఆర్
కొన్నాళ్లుగా దేశంలో కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫలితంగా రహదారులపై వెళ్లేవారిని కాటేస్తున్నాయి. పిట్ బుల్, రాట్ వీలర్ వంటి ప్రమాదకర జాతుల స్వైర విహారం చేస్తున్నాయి. ఇక చాలామంది ఇళ్లలో పెంపుడు కుక్కలు ఉంటున్నాయి. ఒక్కోసారి అవి రోడ్ల మీదకు వచ్చినప్పుడు పలువుర్ని కాటేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెహ్రాడూన్ డాగ్ లైసెన్సింగ్ బైలాస్-2025 పేరుతో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ఇకపై పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే జరిమానా కాకుండా యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.
పిట్ బుల్, రాట్ వీలర్, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్ వంటి జాతుల కుక్కల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కుక్కలు పెంచుకునే వారికి ప్రత్యేక నిబంధనలు విధించింది అక్కడి ప్రభుత్వం. అగ్రెసివ్ కుక్కలను పెంచాలంటే కనీసం 300 చదరపు గజాల ఇల్లు తప్పనిసరి చేసింది. ప్రమాదకర జాతుల సంతానోత్పత్తి పూర్తిగా నిషేధం. ఏడాది దాటిన కుక్కలకు తప్పనిసరిగా సర్జరీ చేయించాలి. ఆ సర్టిఫికేట్ను అధికారులకు సమర్పించాలన్నది మరో నిబంధన. సాధారణ కుక్కల కంటే వీటికి ఏటా రెండువేల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి.
డెహ్రాడూన్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త నిబంధన
అధికారిక గెజిట్లో ప్రచురించబడిన నిబంధనల ప్రకారం.. మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కుక్కలకు లైసెన్స్ పొందడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో పశు వైద్యుడు జారీ చేసిన యాంటీ-రేబిస్ టీకా సర్టిఫికేట్ను సమర్పించాలి. లేకుంటే రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. రిజిస్ట్రేషన్ లేదా పునరుద్ధరణ తేదీ నుండి ఏడాది వరకు చెల్లుబాటు అవుతుంది. బహిరంగ ప్రదేశాల్లో తిప్పేటప్పుడు కుక్కకు గొలుసు, ముఖానికి మాస్క్ తప్పనిసరి.
ఒకవేళ రాత్రి పూట కుక్క విపరీతంగా మొరిగితే కష్టాలు తప్పవు. ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగిస్తే యజమానికి నోటీసులు ఇస్తారు. అంతేకాదు చలానా కూడా విధించే అవకాశం ఉంది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ కుక్కలను పెంచేవారు ప్రైవేట్ యానిమల్ షెల్టర్గా గుర్తిస్తారు. అయితే ఈ విషయంలో పొరుగువారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాల్సివుంటుంది. జంతువుల పట్ల బాధ్యతాయుతమైన పెంపకాన్ని ప్రోత్సహించడమే ఈ చట్టం ఉద్దేశమని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్షతప్పదని హెచ్చరించారు.
ALSO READ: ఇదెక్కడి ఘోరం.. లక్షకు 74 లక్షల వడ్డీ
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటివరకు 24 వేల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం కార్పొరేషన్ ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. పెంపుడు కుక్క ఎవరినైనా కరిచినా, బాధితుడి గాయం బట్టి జరిమానా ఉంటుంది. తీవ్రమైన గాయాలైతే యజమానిపై క్రిమినల్ కేసు పెడతారు. ఆ కుక్కను కార్పొరేషన్ తమ స్వాధీనంలోకి తీసుకోవచ్చు కూడా.