Court rejects Prajwal Revanna anticipatory bail Plea: ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ప్రజ్వల్ రేవణ్ణ తరఫు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. అయితే, మ్యూనిచ్ నుంచి ప్రజ్వల్ మే 30న బెంగళూరుకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం. మే 31 రేవణ్ణ బెంగళూరులో అడుగుపెట్టే అవకాశముంది. ఈ క్రమంలో అందరి దృష్టి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే ఉంది. ఎయిర్ పోర్టులో రేవణ్ణ దిగిన వెంటనే అతడిని సిట్ అధికారులు అరెస్ట్ చేసే అవకాశంలేకపోలేదంటూ ప్రచారం జరుగుతుంది.
మహిళలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్రజ్వల్ రేవణ్ణను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నం చేశారు. ఇటు మాజీ ప్రధాని దేవెగౌడ కూడా హెచ్చరికలు చేశారు. వెంటనే వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ రేవణ్ణను హెచ్చరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తాను విదేశీ పర్యటనకు వెళ్లానని, మే 31న ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతానని, ఈ కేసులో దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానంటూ రేవణ్ణ ఓ వీడియోను సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also Read: మరోసారి చర్చనీయమైన మోదీ వ్యాఖ్యలు.. ఒడిశా సీఎం ఆరోగ్యంపై మాట్లాడుతూ..
అదేవిధంగా తనపై నమోదైన కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ కూడా ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం కోర్టులో విచారణ జరుగగా, సిట్ తరఫు న్యాయవాది ఆమెకు ముందస్తు బెయిల్ విషయమై అభ్యంతరం తెలిపారు. ఇదే కేసులో ఆమె భర్త హెచ్.డి. రేవణ్ణ మధ్యంతర బెయిల్ ను కూడా రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలను న్యాయస్థానం విన్నది. అనంతరం భవానీకి ముందస్తు బెయిల్ పై తీర్పును మే 31కి రిజర్వు చేసింది.